- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డబ్బులు కొట్టు.. ఉద్యోగం పట్టు

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తూడెం జిల్లాలోని నిరుద్యోగులు దళారులు, పైరవీకారుల కబందహస్తాల్లో చిక్కుకుంటున్నారు. సింగరేణి, కేటీపీఎస్లో ఉద్యోగాల కోసం రూ. లక్షల్లో చెల్లిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. యూనియన్ లీడర్లుగా చెలామణి అవుతున్న కొందరు పైరవీకారులు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. ఒక్కో నిరుద్యోగి వద్ద స్థాయికి తగ్గట్లు రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు దండుకుంటున్నారు. ఈ విషయం బయట ఎవరికి చెప్పొద్దని, చెబితే ఉద్యోగం రాకపోగా, కట్టిన డబ్బులు వాపస్ రావు అంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. అప్పోసప్పో చేసి అడిగినంతా డబ్బులు చెల్లించినా.. ఉద్యోగాలు రాకపోవడంతో పైరవీకారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయం బయటకు చెప్పలేక లోనా దాచులేక మధన పడుతున్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతను ఆసరాగా చేసుకుని వందల సంఖ్యలో పైరవీకారులు పుట్టుకొచ్చారు.
పారిశ్రామిక ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగం తాండవిస్తున్నది. జిల్లాలో ప్రధానంగా సింగరేణి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలు ఉన్న జిల్లాలో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురవుతున్నది. ప్రైవేటు సంస్థల్లో చదువుకు తగ్గ ఉద్యోగం లభించక, సింగరేణి, కేటీపీఎస్లో ఉద్యోగం సాధించాలని ధృఢ సంకల్పంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో కొంతమంది పట్టణాల బాట పడుతుంటే, మరికొంతమంది ఎలాగొలా ఉద్యోగం సాధించాలని దళారులను నమ్మి మోసపోతున్నారు.
రూ. లక్షల్లో వసూళ్లు
ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురు చూసి ప్రయత్నాలు విఫలమైన నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోతున్నారు. సింగరేణి కేటీపీఎస్ లో ఉద్యోగాలు వెలగబెడుతూ యూనియన్ నాయకులుగా ఎదిగిన కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తాం పెద్దసార్లంతా తమ దోస్తులే తమ మాట వారికి వేదవాక్కు అని కల్లబొల్లి మాటలు చెప్పి ఒక్కో నిరుద్యోగి వద్ద స్థాయికి తగ్గట్లు రూ. 3 నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగ యువత స్తోమతకు మించి అప్పులు చేసి దళారులకు సమర్పించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంస్థలకు ఎటువంటి సంబంధం లేని బయటి వ్యక్తులు ఉద్యోగం ఇప్పించడం తమకు వెన్నతో పెట్టిన విద్య అంటూ రూ. లక్షలు వసూలు చేసి నిరుద్యోగ యువతకు చుక్కలు చూపిస్తున్నారు.
యూనియన్ లీడర్లు చెలామణీ..
సింగరేణి కాలరీస్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లలో యూనియన్ నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు ఉద్యోగాలు ఇప్పిస్తాం, ట్రాన్స్ఫార్లు చేపిస్తాం, ఉద్యోగికి ఎటువంటి అనారోగ్యం లేకుండా మెడికల్ అన్ఫిట్ చేపించి పిల్లలకు ఉద్యోగం వచ్చేలా చేస్తామంటూ ట్రాన్స్ఫార్కు రూ. 5 లక్షలు, మెడికల్ అండ్ వైట్కు రూ.18 నుంచి రూ. 20 లక్షలు, ఏకంగా ఉద్యోగం కావాలంటే రూ. 30 లక్షల వరకు డిమాండ్ చేసి, అడ్వాన్స్గా అందినంత పుచ్చుకుంటున్నారు. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదని, ఒకవేళ తెలిస్తే ఉద్యోగం రాకపోగా డబ్బు కూడా పోతుందని నిరుద్యోగులకు ముందే చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలా ఒకరిద్దరే చేస్తున్నారంటే పప్పులో కాలేసినట్లే. జిల్లాలో నిరుద్యోగం తాండవిస్తున్న తరుణంలో వందల సంఖ్యలో పైరవీ కారులు పుట్టుకొచ్చారు.
నిరుద్యోగ యువతే లక్ష్యం
నిరుద్యోగులే టార్గెట్గా బయటపడని మోసాలు ఎన్నో.. అప్పోసప్పో చేసి పైరవీకారులకు రూ. లక్షలు సమర్పించుకున్న నిరుద్యోగులు పైరవీకారుల వెంట ప్రదక్షిణలు చేస్తున్నారు. పెద్దసార్తో మాట్లాడాను. ఇవ్వాలో రేపో నీ పని అయిపోతుందంటూ ఏళ్లతరబడి కాలం వెళ్లబుచ్చుతున్నారు. ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారైంది నిరుద్యోగుల పరిస్థితి. చెప్పులరిగేలా తిరుగుతున్నా రేపు మాపు అంటూ ఏండ్లు గడుస్తున్నా బయటపడ లేని పరిస్థితి. ముందు చెప్పిన ఒప్పందం ప్రకారం మూడో కంటికి విషయం తెలియకూడదు, ఒకవేళ తెలిస్తే ఉద్యోగం రాకపోగా డబ్బు పోతుందన్న పైరవీకారుడి మాటలకు భయపడి ఉద్యోగం రాకపోయినా ఫర్వాలేదని, తన డబ్బు తనకు వస్తే చాలు అని బయటికి చెప్పుకోలేక మదనపడుతున్నారు. కట్టిన డబ్బు వసూలు చేసుకుని బయటపడదామనే ఉద్దేశంతో వందల సంఖ్యలో నిరుద్యోగులు పైరవీకారుల వెంబడి తిరుగుతున్నారు. యూనియన్లను అడ్డం పెట్టుకుని నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.