- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నా కొడుకు చెబితేనే మీకు దళిత బంధు ఇస్తా... లేకపోతే లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే...?

దిశ, ఖమ్మం బ్యూరో: ఆ నియోజకవర్గం అంటేనే టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పి.. అక్కడి ఎమ్మెల్యే ఏం మాట్లాడినా.. ఏం చేసినా వివాదాస్పదమే.. గతంలో ఎన్నోసార్లు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ నియోజకవర్గమే వైరా.. ఎమ్మెల్యే రాములు నాయక్ ఎన్నోసార్లు నోరుజారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం.. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు స్కీం అబాసుపాలు చేసే విధంగా ఆ ఎమ్మెల్యే వ్యవహారశైలి మారిందన్న ఆరోపణలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.. దళితులు ఆత్మగౌరవంగా బతికేందుకు, వారి కాళ్లపై వారు నిలబడేలా రూపొందించిన ఈ పథకాన్ని వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన అనుచరులకు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దళితులు కాకున్నా.. తమకు నచ్చినవారికి రెండుమూడు యూనిట్ల చొప్పున ఇచ్చి.. వాటిని తమ ఇష్టం ఉన్నవారికి అమ్ముకోమని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీవారే దళారుల అవాతరమెత్తి కమీషన్లు తీసుకుని వాటిని దళితులకు వచ్చేలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.. అయితే పైకి పేరు ఎమ్మెల్యేదే అయినా.. ఆయన తనయుడు జీవన్ లాల్ వెనుకుండి ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు సమాచారం. దీంతో అర్హులైన దళితులు ఎమ్మెల్యే, ఆయన తనయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళితబంధు దళితులకు కాదట..
ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అర్హులను పారదర్శకంగా గుర్తించి వారి అభ్యున్నతికి తోడ్పడేలా ఓ వ్యవస్థను రూపొందించారు. అర్హుల ఎంపిక బాధ్యతను నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకే అప్పగించారు. అయితే వైరా నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే రాములు నాయక్, ఆయన కొడుకు జీవన్ లాల్ ఈ పథకాన్ని పూర్తిగా అబాసుపాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓ గొప్ప పథకాన్ని పూర్తిగా దళితులకు కాకుండా తమ అనుచరులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మండలాల వారీగా మీటింగులు ఏర్పాటు చేసి అన్ని పంచాయతీల సర్పంచులకు, ఎంపీటీసీలకు ఒక్కోటి చొప్పున అప్పగించినట్లు సమాచారం. వీరితోపాటు ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు, పార్టీకి చెందిన వారికి కూడా అప్పగించి తమకు ఇష్టమైన వారికి ఇచ్చుకోండంటూ చెప్పినట్లు కూడా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం 500 యూనిట్లలో దాదాపు 300 వివిధ పార్టీలు, ప్రతినిధులకు అప్పజెప్పి మిగతావాటిని తమ దగ్గర ఉంచుకోవడం విశేషం.
అమ్ముకోండంటూ సంకేతాలు..
నియోజకవర్గానికి వచ్చిన దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే, ఆయన తనయుడు దళితులు కానివారికి అప్పగించి తమకు నచ్చినవారికి అమ్ముకోండంటూ సంకేతాలిచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడే ఇంకో విశేషమేంటంటే.. వీరు ఇచ్చిన పంచాయతీల్లో దళితలు లేని పంచాయతీలు కూడా ఉండడం గమనార్హం. కొన్ని చోట్ల కేవలం ఎస్టీలే ఉన్న తండాలకు యూనిట్లు ఇస్తున్నట్లు చెప్పి.. నియోజకవర్గంలో తమకు నచ్చినవారికి ఇచ్చుకోవచ్చని కూడా చెప్పారట.. కానీ తమకు అనుకూలంగా ఉండాలని.. భవిష్యత్తులో తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే ఆయన కుమారుడు జీవన్ తీరుతో పార్టీ శ్రేణులే విస్తుపోతున్నాయి..
సగానికి సగం కమీషన్..
ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఇచ్చిన హామీతో కొంతమంది దళారుల అవతారం ఎత్తినట్లు ప్రచారం జరుగుతోంది. తాము దళితబంధు ఇప్పిస్తామంటూ తెలిసినవారికి కబురు పంపడం.. తెలిసిన వారితో దళితులను అడిగించడం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఒక్కో యూనిట్ కు 40 పర్సెంట్ నుంచి 50 పర్సెంట్ వరకు కమీషన్ అడుగుతున్నట్లు సమాచారం. కొంతమంది మాత్రం తాము దళితబంధు ఇప్పిస్తామంటూ అడ్వాన్సులు కూడా తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.. అయితే రూ.10 లక్షలు యూనిట్ కాస్ట్ కావడంతో ఎంత వచ్చినా బెటర్ కదా అంటూ అర్హత లేని దళితులు సైతం ఓకే చెప్పేస్తున్నారట..
సంత సరుకులా ప్రతిష్టాత్మక పథకం..
మొదటినుంచి ఈ పథకం దళారుల పాలవుతున్నా.. ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తూ వస్తోంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యే స్థాయి నేతలు కాకుండా వారి కింది స్థాయి నాయకుల దళితబంధు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతూ కమీషన్లు తీసుకున్నారు. అయితే వైరా నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే రాములు నాయక్, ఆయన కొడుకు జీవన్ లాల్ మీటింగులు పెట్టి మరీ అర్హులైన దళితులకు కాకుండా... సర్పంచులు, ఎంపీటీసీలు, వారి ముఖ్య అనుచరులకు అప్పగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. మొత్తం తండ్రీకొడుకుల తీరుతో నియోజకవర్గంలో ఓ ప్రతిష్టాత్మక పథకం అంగడి సరుకులా మారిందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా పార్టీ పెద్దలు దృష్టి సారించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని దళితులు వేడుకుంటున్నారు.
Read more: