ఖమ్మంలో గుట్టలను పిండి చేస్తున్న ఘనులు...

by S Gopi |
ఖమ్మంలో గుట్టలను పిండి చేస్తున్న ఘనులు...
X

దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో స్థానిక 57వ డివిజన్ వికలాంగుల కాలనీలో సుమారు 15 అడుగులు రాళ్లగుట్టను అధికార పార్టీకి చెందిన కొందరు తొలిచేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తతంగం గత పది పదిహేను రోజులుగా జరుగుతున్నా స్థానిక అధికార పార్టీ నేతలకు సంబంధించిన వారు కావడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయకపోగా, చేసినవారిని సైతం బెదిరిస్తూ ఆ గుట్టను తొలి చేస్తున్నట్లు స్థానికులు వాపుతున్నారు. ఈ విషయంపై దిశ ప్రతినిధికి ఆదివారం సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విషయం పరిశీలించగా సుమారు 15 అడుగుల గుట్టను తొలిచేస్తూ అధికార పార్టీకి చెందిన కొందరు ఆ ప్రాంతంలో ఇల్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ గుట్టను అనుకుని కొన్ని ఇండ్లు ఉండడంతో వారు చేస్తున్న బ్లాస్టింగ్ వల్ల ఆ ఇండ్లకు నేర్రలు వస్తున్నాయని బాధితులు మొరపెట్టుకుంటున్నా ఇవేమీ పట్టించుకోకుండా మీ చేతనైతే కేసు పెట్టుకోమంటూ వారిని బెదిరిస్తున్నట్లు స్థానికురాలు జాన్ బి దిశ ప్రతినిధికి వివరించారు. ఇప్పటికే డివిజన్లో పలుచోట్ల గుట్టలను కొట్టి ఆ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు చేపడుతూ దొంగ పట్టాలను సైతం సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

ప్రస్తుతం గుట్టని కొట్టిస్తున్న నాయకుడే గతంలో కూడా ఒక గుట్టని తొలచి అధికారుల ఆగ్రహానికి గురై నష్టపరిహారం చెల్లించడం జరిగిందని వాపోతున్నారు. ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ అండదండలు మెండుగా ఉండడంతో ఆ గుట్ట తొలిచే వ్యక్తి ఆ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావడం ఆయనకి కలిసి వచ్చిన అంశాలుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఎక్కడ గుట్టలు ఉన్నా వాటిని తొలిగించాలి అంటే మైనింగ్ అధికారుల అనుమతులు, కార్పొరేషన్ పరిధిలో కాబట్టి వారి అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలి. కానీ వీరి అనుమతులు ఏమి లేకుండానే ఆ గుట్టను తొలచడం స్థానికులను విస్మయంకి గురిచేస్తోంది. ఇప్పటికే అధికార పార్టీపై ప్రజల్లో అపనమ్మకం పెరగడం రేపు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ వ్యతిరేకత మూట కట్టుకుందని జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో ఇలాంటి కొంతమంది నాయకుల పనితీరుతో మరింత వ్యతిరేకతను మూట కట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని పేద ప్రజల ఇండ్లకు ఎలాంటి అపాయం తలెత్తకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed