గొర్రెల పంపిణీ పథకం నగదు బదిలీ ద్వారా అమలు చేయాలి

by Nagaya |
గొర్రెల పంపిణీ పథకం నగదు బదిలీ ద్వారా అమలు చేయాలి
X

దిశ,కల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టుకుండా నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని గొర్రెల మేకల పెంపొందారుల సంఘం(జిఎంపిఎస్) జిల్లా నాయకత్వం రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య శాఖా మంత్రి టి. హరీష్ రావు ని కల్సి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రం లో గత "ఏ" లిస్ట్ గొర్రెల పంపిణీలో మద్య దళారులు, కొంతమంది అధికారులు మాత్రమే బాగుపడ్డారని, పథకం అస్సలు లబ్ధిదారులైన యాదవ, కురుమలకు అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు ప్రారంభించబోయే "బి" లిస్టు గొర్రెల పంపిణీ కూడా పాత పద్ధతిలోనే పంపిణీ చేపడతామని అధికారులు తెలిపారని, దీని వలన మరలా లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని వాపోయారు. దీనికి తోడు ప్రతి ఒక్కరూ కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలని, మరణించిన సభ్యుల స్థానంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకురావాలని అధికారులు చెప్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. ఇప్పటికే 10 నెలలుగా డబ్బులు కట్టి ఎదురుచూస్తున్నవారికి దీనివలన మరింత కాలయాపన జరిగే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఖమ్మం జిల్లాకు చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక జిల్లాలలో గొర్రెలు కొనుగోలు చేసి తీసుకురావాలని నిర్ణయించారని, ఇంత సుదూర ప్రాంతాల నుండి తీసుకొస్తే ఈ వేసవికాలంలో మార్గమధ్యంలోనే అనేకం చనిపోయే అవకాశం ఉందన్నారు. ఇన్ని వ్యయ ప్రయాసలు లేకుండా మునుగోడు మాదిరిగా నగదు బదిలీ చేసి యాదవ, కురుమల కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం లక్ష్యం నెరవేరేలాగా చూడాలని జిఎంపిఎస్ కోరింది.

స్పందించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నగదు బదిలీ అమలు చేయాలంటే యన్ సి డి సి ఆమోదం కావాలని ఇందు కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇతర సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మామిళ్ళ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు భట్టు నర్సింహారావు, గాయం తిరుపతిరావు, కృషార్జన్ రావు ఉన్నారు.



Next Story

Most Viewed