కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ : కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి

by Vinod kumar |
కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ : కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి
X

దిశ, ఖమ్మం సిటీ: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు పంక్చర్ కావడం ఖాయమని కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. మంగళవారం ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. ఖమ్మంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానంలో నాలుగు లక్షలకు పైగా ఓట్లను సాధించామని గుర్తుచేశారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాలేరు నుంచి పర్ణశాల వరకు అభివృద్ధి చేశానని తెలిపారు.


కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేణుక ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. హిందుత్వ ముసుగులో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. ఖమ్మం జర్నలిస్టులకు నాలుగు సార్లు స్వయంగా తండ్రి, కొడుకులు హామీ ఇచ్చి పట్టించుకోలేదని అన్నారు. దేశంలో చరిత్రహీనులుగా మిగిలిపోయిన నేతలు కూడా నేడు కథలు చెబుతున్నారని అన్నారు. ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో రెండు సార్లు ఓడిపోయాం.. ఇది మా స్వయంకృతం.. అందుకు చెంపలేసుకుని ప్రజలలోకి వచ్చామని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.



Next Story