టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. రాజీనామా ప్రకటించిన ఇద్దరు నేతలు..!

by Dishafeatures2 |
టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. రాజీనామా ప్రకటించిన ఇద్దరు నేతలు..!
X

దిశ, కరకగూడెం : కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. తాము పార్టీ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాళ్లు తమ నిర్ణయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆశయాలు అయిన నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గత ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపారని వారు అన్నారు. అయితే ప్రజల ఆశయాలను అడియాశలు చేస్తూ, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 8 సంవత్సరాల్లో కనీసం సచివాలయానికి వెళ్లకుండా దొరల పాలన సాగిస్తున్నారని, మిగిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వత్తాసు పలుకుతున్నారు.

2019 సంవత్సరంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాశ్వత సమస్యలు పరిష్కారమై ప్రజలు సంతోషంగా ఉంటారని భావించామని తెలిపారు. దానికి భిన్నంగా కేవలం ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు మాత్రమే బాగుపడ్డారని, దీని వల్ల సామాన్యులకు ఒరిగిందేమీ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అభివృద్ధిని కాంక్షించే పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని, క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతో తాము సేవలందించామన్నారు. కానీ గడిచిన కొంతకాలంగా మా పట్ల వ్యతిరేక భావనతో ఉండడంతోనే, తాము ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు.


Next Story

Most Viewed