భూ రాబందులకు రైతుబంధు

by Mahesh |
భూ రాబందులకు రైతుబంధు
X

దిశ, వైరా: వైరా మండలం రెబ్బవరం గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమించిన రాబంధువులకు దర్జాగా రైతుబంధు పథకం వర్తిస్తుంది. ఏకంగా ఐదేళ్లుగా ఆక్రమణదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. ఇప్పటివరకు సుమారు రూ.3.50 లక్షలకు పైగా ప్రభుత్వ నగదు జమైంది. రెబ్బవరం గ్రామంలోని అభయాంజనేయ స్వామికి చెందిన ఆరు ఎకరాల 39 కుంటల భూమి రెండు దశాబ్దాల క్రితమే ఆక్రమణకు గురైంది. దేవుడి భూమి కోసం గ్రామస్తులు పలు దఫాలుగా ఆందోళన నిర్వహించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కంచే చేను మేసిన చందాగా దేవుడికి పూజ చేసిన అర్చకులు ఆలయ భూమిని ఆక్రమించడం విశేషం. ఈ భూమిని ఆక్రమించిన వారి పేరుపై ధరణి పాసుబుక్కులు కూడా మంజూరయ్యాయి.

సుమారు 20 ఏళ్ల క్రితం ఈ భూముల ఆక్రమణకు గురైన దేవాదాయ శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం విశేషం. రెబ్బవరం గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయానికి నైజాం నవాబులు ఆరు ఎకరాల 39 కుంటల ఇనాం భూమిని కేటాయించారు. దేవాలయంలో స్వామికి నైవేద్యం పెట్టే అర్చకులు ఈ భూమిని సాగు చేసుకుని జీవించాలని ఉద్దేశంతో నైజాం నవాబులు ఈ భూమి దేవాలయానికి ఇచ్చారు. అర్చకుల కన్ను భూమిపై పడింది. 1985లో ఈ దేవాలయానికి అర్చకుడిగా ఉన్న వ్యక్తి రెబ్బవరం గ్రామ సర్పంచ్‌గా పనిచేశారని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో దేవాలయానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు అన్నీటిని మార్చి స్వామివారి పొలాన్ని తన పేరుపై మార్చుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కొనసాగుతున్న ఆందోళనలు

సుమారు రెండు దశాబ్దాలుగా అభయాంజనేయ స్వామి దేవుడి భూమి కోసం గ్రామస్తులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. 2003 నుంచి గ్రామస్తులు తమ గ్రామంలోని స్వామి వారి భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసినప్పుడు దేవాదాయ శాఖ అధికారులు స్పందించడం అనంతరం సైలెంట్‌గా మారటం పరిపాటిగా మారుతున్నది. అక్రమార్కుల చేతుల్లో ఉన్న ఈ దేవాలయ భూమి ప్రస్తుతం మూడు కోట్ల రూపాయలకు పైగానే విలువ ఉంటుంది. గ్రామస్తులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోతుంది. ప్రస్తుత రెబ్బవరం సర్పంచ్ సాధం రామారావు కూడా జిల్లా మంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు దేవాలయ భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదులు కూడా చేశారు. అక్రమార్కలు హైకోర్టులో రిట్ వేయగా, దీన్ని దేవాదాయ శాఖ అధికారులు చాలెంజిగా తీసుకున్నారు.

ఆధారాలు ఇవే..

రెబ్బవరం దేవాలయానికి సంబంధించి పహాణి రికార్డులను అన్నిటిని మ్యాన్ ప్లేట్ చేసినా కొన్ని ఆధారాలు దేవాదాయ శాఖ అధికారులకు లభించాయి. 1970లో మధిర తహశీల్దార్ అప్పట్లో మంజూరు చేసిన రౌతు వారి ధ్రువీకరణ పత్రం దేవాలయ శాఖకు లభించింది. అదే విధంగా 1958లో ఉర్దూ భాషలో ఉన్న పహాణిలో అభయాంజనేయ స్వామి పేరు పైనే ఆ భూములు ఉన్నాయి. అంతేకాకుండా తీన్సాల్ పహాణి లో కూడా ఆయా సర్వే నెంబర్లలో అభయాంజనేయ స్వామి పేరు ఉంది. ఈ ఆధారాలతో స్వామివారి భూమిని కబ్జా దారుల నుంచి రికవరీ చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

రూ.3.50 లక్షల రైతుబంధు

రెబ్బవరంలో దేవాలయం భూమిని ఆక్రమించిన వారికి రైతుబంధు నగదును మంజూరు చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు రబీ ఖరీఫ్‌లో రూ.5వేల చొప్పున మొత్తం 6.39ఎకరాలకు ఇద్దరు వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు జమవుతున్నది. ఇప్పటివరకు సుమారు 3.50లక్షల రూపాయల నగదు రైతుబంధు పథకం నుంచి ప్రభుత్వ భూములను అనుభవిస్తున్న వారి ఖాతాలకు జమ కావడం విశేషం. గతంలో గ్రామస్తులు ఆందోళన చేసిన సమయంలో రైతుబంధు పథకాన్ని అక్రమార్కులకు వర్తింపకుండా చేస్తామని అప్పట్లో అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే నేటి వరకు హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దేవాలయం భూమిని ఆక్రమించిన వారికి రైతుబంధు పథకాన్ని తొలగించి ప్రభుత్వ నగదును దుర్వినియోగం కాకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed