- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంగ్లీష్ మద్యం కాదు ఇంగ్లీష్ విద్య కావాలి: ఆర్ఎస్ ప్రవీణ్

దిశ, వైరా: బహుజనులకు ఈ ప్రభుత్వాలు పోసే ఇంగ్లీష్ మద్యం కాదని, బతుకు బాట చూపే ఇంగ్లీష్ విద్య కావాలని, అది బహుజనులకు రాజ్యాధికారంతోనే సాధ్యమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( ఐపీఎస్) అన్నారు. గురువారం ఉదయం నుండి ఆయన వైరా మండలంలో విస్తృతంగా పర్యటించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల జనులందరూ ఐకమత్యంగా ఉండాలని, ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టే మద్యం సీసాలు, మాంసం పోగులు, దళిత బంధులు అవసరం లేదని స్పష్టంగా చెప్పాలని అన్నారు.
ఒకే ఒక సంతకంతో మానవ జీవితాలను మార్చుకునే అవకాశం ఉంది ఆ అవకాశం ముఖ్యమంత్రి ఇవ్వనంటున్నాడు. అందుకే మనకు రాజ్యాధికారం కావాలంటున్నాం, అది అడుక్కుంటే రాదని ఐక్యంగా ఉండి గుంజుకుంటేనే వస్తుందని ఆయన విజ్ఞప్తి చేశారు. మన పిల్లల చదువుకు అంతో ఇంతో దోహదపడే వసతి గృహాలను రద్దు చేసిపడేసిండు. ఐదు తరాలుగా కూలిపనులు చేసి బతుకుతున్న మనం ఇంకెన్ని తరాలు కూలి చేద్దాం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.
వాటిలో రాళ్ళు మోసుడు తప్ప ఎక్కడైనా మన బిడ్డలకు ఒక చిన్న ఫ్యాక్టరీ ఉన్నదా, అని సత్తుపల్లి నుండి ఆదిలాబాద్ వరకు సింగరేణి విస్తరించి ఉన్నది. ట్రాన్స్ పోర్ట్ కంపెనీలన్నీ దొరలవి, ధనవంతులవేనని, మన బిడ్డలందరూ తట్ట మోసుడుకు మాత్రమే ఉపయోగపడటం దారుణమని, అందుకే బహుజన బిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు సాధించాలని ఆయన అన్నారు. మనుషులంతా జీవించాలంటే పేదల రాజ్యం బహుజనుల రాజ్యం రావాలి. ఇప్పటికి 500 గ్రామాల్లో పర్యటించా, ఇంకా 4500 గ్రామాల్లో పర్యటించాలి.
రాజ్యాధికారం రావాలి, ప్రగతి భవన్లో కేసీఆర్ను ముఖ్యమంత్రి సీటు నుండి దించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు, 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలించినా బహుజనులకు ఒరిగింది ఏమి లేదన్నారు. కేసీఆర్ కుటుంబం 50 ఎకరాల నుండి 300 ఎకరాలకు పెరిగి సుమారు 60 కోట్లతో బంగ్లాలు కట్టటమే గాక కాళేశ్వరం నుండి కొండ పోచమ్మకు నీళ్ళు మల్లించటం కేసీఆర్ భూముల కోసమేనని ఆయన అన్నారు.
మన బిడ్డలకు మంచి చదువులు, మంచి ఉద్యోగం ఉండకూడదని, మనకు వస్తే తెలివి మీరి ప్రశ్నిస్తారని, అది పాలక వర్గాలకు గిట్టని విషయమని ప్రవీణ్ అన్నారు. రాష్ట్రంలో పేదల చేతిలో ఉన్న అసైన్డ్ భూములను గుంజుకుని కోట్లు గడించటానికి ఈ ప్రభుత్వం కోట్లు గడించే కుట్ర పన్నిందని విమర్శించారు. తెలంగాణలో పెద్ద పెద్ద బావులు తవ్వి డబ్బులు బావుల్లో దాచారని ఎన్నికలు రాగానే అవి గ్రామాలకు, మన గడపలకు వస్తాయి జాగ్రత్త అవే మనల్ని కూలీలుగా ఉంచటానికి కారణం అని అన్నారు.
మళ్లీ మోసపోవద్దని అధికారం అందిపుచ్చుకోవాలని, తరతరాల దారిద్య్రాన్ని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలో గండగల పాడు, సిరిపురం, గరికపాడు, లింగన్న పాలెం, విప్పలమడక పాలడుగు, గొల్లేనపాడు తదితర గ్రామాలలో ప్రవీణ్ కుమార్ పర్యటన సాగింది. ఆయనకు గ్రామాలలో ఘనస్వాగతం పలికారు.