రేపటి నుంచి ఎడ్ల పందాలు

by Sridhar Babu |
రేపటి నుంచి ఎడ్ల పందాలు
X

దిశ, వేంసూర్ : రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి సొంత గ్రామమైన వేంసూర్ మండలం కందుకూరులో జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి వృషభ రాజముల బండ లాగుడు పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత హంగులతో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మందపాటి వెంకటరెడ్డి, బండి జగదీశ్ రెడ్డిలతో పాటు కమిటీ నేతృత్వంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. గెలుపొందిన వారికి రూ.10 లక్షలకు పైగా బహుమతులను నాలుగు విభాగాల్లో అందజేయనున్నారు. 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ప్రారంభ వేడుకలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో పాటు, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఏడవ తేదీన రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమంలో పాల్గొంటారు.

పోటీలో పాల్గొనుటకు 10 జతలకు పైగా వృషభరాజములు కందుకూరు గ్రామానికి చేరుకున్నాయి. వృషభ రాజములకు, పెంపకం రైతులకు తగిన ఏర్పాట్లను క్రీడా కమిటీ ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన వేలాది మంది తరలి వచ్చే ఈ పోటీలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టెంట్లు , మంచినీటి సౌకర్యం, అతిథులు కూర్చునేందుకు భారీ స్టేజీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మహిళల సంఖ్య అధికంగా ఉండటంతో వారు కూర్చొని క్రీడను తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీ సౌకర్యం కల్పించారు . ప్రభుత్వ, ప్రైవేటు సెక్టర్ల ఆధ్వర్యంలో రైతులకు పంటల నిర్వహణ పై పెద్ద ఎత్తున అవగాహన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఎద్దుల పోటీలు తిలకించే భక్తులకు, ప్రజల కోసం సర్పంచ్ బూరుగు నాగేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు.



Next Story

Most Viewed