- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అధికారులతో ఎంపీ నామా నాగేశ్వరరావు కీలక సమావేశం.. వాటిపైనే ప్రధాన చర్చ

దిశ ప్రతినిధి, ఖమ్మం: మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. సోమవారం ఖమ్మం నగరం ఎన్నెస్పీ క్యాంపు డీపీఆర్సీ భవన సమావేశ మందిరంలో కేంద్రం నుంచి జిల్లాకు మంజూరయ్యే పథకాలు, నిధులుపై జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కృషి యోజన పథకం, గ్రామీణ స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి సడక్ యోజన, జాతీయ ఆరోగ్యమిషన్తో పాటు 41 పథకాల అమలు తీరుపై చైర్మన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే పథకాలు సక్రమంగా అమలు జరిగేలా దిశా కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అలాగే అధికారులు పథకాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. కేంద్రస్థాయి పథకాలు అనేకం ఉన్నాయని, జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాలు విజయవంతంగా నిర్వహించ బడుతున్నాయని, మిగతా పథకాలు కూడా అదేస్థాయిలో అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. పథకం ఉద్దేశం, అమలు విధానంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో పంటకాలువల అంశం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసుకోవాలని, పెండింగ్ బిల్లులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.