చదువుకునేందుకు డబ్బులు లేక వ్యభిచారం

by Sridhar Babu |
చదువుకునేందుకు డబ్బులు లేక వ్యభిచారం
X

దిశ, బూర్గంపాడు : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు.10 మంది మహిళలను రక్షించారు. ముగ్గురు నిర్వాహకులు 18 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన స్పా నిర్వాహకురాలు శృతి స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర గ్రామం. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో ఓ అపార్ట్మెంటును శృతి అద్దెకు తీసుకుంది. అపార్ట్మెంట్ ముందు పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో స్పా సెంటర్ అనే బోర్డు పెట్టారు. స్పా సెంటర్ అని చెప్పి రాయల శృతి, రమణ, జాహెద్ ముగ్గురూ కలిసి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఇక్కడ స్పాపేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలోని బృందం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న పర్పుల్ నేచురల్ హెల్త్ అనే మసాజ్ సెంటర్‌పై దాడి చేసింది. వ్యభిచార కూపం నుంచి బయటపడిన మహిళలు ఢిల్లీకి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని, రక్షించిన మహిళలను తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. రాయల శృతి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.

యువతులను పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితురాలు శృతి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. నిర్వాహకురాలు శృతి డాక్టర్ కావాలనుకుని దారి తప్పినట్లు గుర్తించారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన శృతి డాక్టర్ కావాలి అనుకుంది. మధ్యవర్తి ద్వారా ఉక్రెయిన్ లో మెడిసిన్‌లో చేరింది. మొదటి సంవత్సరం పూర్తి చేసిన శృతి రెండవ సంవత్సరం ఫీజు చెల్లించలేక పోవడంతో స్వస్థలం మోరంపల్లి బంజరుకు తిరిగి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అమీర్‌పేట్‌లో ఎయిర్ హోస్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత బంజరా హిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది. డాక్టర్ కావాలనుకున్న శృతి కోరిక నెరవేరక పోవడం, తర్వాత ఎయిర్ హోస్ట్రెస్‌ కావాలన్న కలలు తీరకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచింది. అమ్మాయిలను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించింది. గతంలో కూడా పంజాగుట్ట పోలీసులు మసాజ్ సెంటరులో దాడులు చేసి నిందితురాలు శృతిని అదుపులో తీసుకుని జైలుకి పంపారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా శృతిలో మార్పు రాకపోగా తిరిగి బంజారాహిల్స్ లో మరో స్పా సెంటర్ ముసుగులో పాత దందా మొదలుపెట్టింది. దీంతో మంగళవారం రెండోసారి శృతి పోలీసులకు చిక్కింది. శృతితో పాటు మరో ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. నిర్వాహకురాలు శృతితోపాటు 10 మంది యువతులను,18 మంది విటులను అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో శృతి స్వగ్రామ ప్రజలు అవాక్కయ్యారు. గ్రామంలో ఎక్కడ చూసినాన ఇదే చర్చ జరుగుతోంది.



Next Story

Most Viewed