కేసీఆర్ పై చవాకులు పేలితే ఖబర్దార్... షర్మిలపై ఎమ్మెల్సీ మధుసూదన్ రావు ధ్వజం

by Sridhar Babu |
కేసీఆర్ పై చవాకులు పేలితే ఖబర్దార్... షర్మిలపై ఎమ్మెల్సీ  మధుసూదన్ రావు ధ్వజం
X

దిశ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడ్డది నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి, మీ అన్న జగన్ మోహన్ రెడ్డి, నువ్వు కాదా..? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బహిర్గతంగానే వ్యతిరేకించిన మీ కుటుంబం ఈరోజు తెలంగాణలో ఆడుతున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పై చవాకులు పేలితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను బీజేపీ పెద్దలతో కుమ్మక్కై పాలేరు వేదికగా అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలన్నీ ధనయజ్ఞంగా మార్చి అక్రమంగా కోట్లు సంపాదించింది మీ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ని ముదిగొండలో అమాయకులైన ప్రజలను కాల్చి పొట్టన పెట్టుకుంది మీ నాన్న కాదా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డలం మడమతిప్పం అంటూనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే మూడు రాజధానుల పేరుతో అమరావతిని ముంచారన్నారు. ఎంతోమంది యువకులు బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచారన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం లో భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల్లో నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు కేసీఆర్ రైతుల పక్షాన నిలిచారన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పాలనపై నువ్వు చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. పాలేరు నియోజకవర్గంలో నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కనీసం ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. నువ్వు నిజంగా చర్చకు సిద్ధమైతే స్థానిక ఎమ్మెల్యే ద్వారా పాలేరులో జరిగిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై తిప్పి చూపిస్తామన్నారు. తెలంగాణలో నువ్వు పార్టీ పెట్టుకుని తిరిగే స్వేచ్ఛ ఎవరికైనా ఉందని, కానీ తెలంగాణ రాష్ట్రంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తే చూసి ఊరుకునే వారు ఎవరూ లేరన్నారు. ఇకనైనా బుద్ధిగా మెలిగి ప్రశాంతమైన తెలంగాణలో మీ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఎటువంటి చర్చలు చేసిన బీఆర్ఎస్ స్వాగతిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జెడ్పీ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, కూసుమంచి మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, జిల్లా యువజన అధ్యక్షులు చింతనపు కృష్ణ చైతన్య, రైతు సమన్వయ అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story