మాటల గారడీతో సీఎం ప్రజలను మోసం చేస్తున్నాడు.. ఎమ్మెల్యే పొదెం వీరయ్య

by Sumithra |
మాటల గారడీతో  సీఎం ప్రజలను మోసం చేస్తున్నాడు.. ఎమ్మెల్యే పొదెం వీరయ్య
X

దిశ, భద్రాచలం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడితో ప్రజలను మభ్య పెడుతున్నాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలను, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మొదటిసారి కళ్యాణానికి వచ్చినప్పుడు 100 కోట్లతో రామాలయ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ హామీని నెరవేర్చకుండా, గత ఏడాది వరదల సమయంలో వచ్చినప్పుడు 1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇండ్ల నిర్మాణాలు కరకట్ట ఎత్తు పొడిగింపులను చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చాడని, కానీ ఇప్పటివరకు వంద రూపాయలు కూడా హామీలో భాగంగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బూటకపు హామీలతో భద్రాచల ప్రాంత ప్రజలను మోసం చేశాడని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా భద్రాచల ప్రాంత ప్రజలను మోసం చేసిన కారణంగా భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. భద్రాచలం రామాలయ అభివృద్ధికి 100కోట్ల హామీకి ఎనిమిదేండ్లు.. భద్రాచలం గోదావరి వరదల శాశ్వత పరిష్కారానికి 1000కోట్ల హామీకి మొదటి ఏడూ గడిచిపోయాయని అన్నారు. భద్రాచల నియోజకవర్గంపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. ఇటీవలే పినపాక నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు ఇచ్చిన కేసీఆర్ కు భద్రాచల రామాలయ అభివృద్ధికి ఇస్తానన్న 100 కోట్లు, వరదలకు శాశ్వత పరిష్కారంగా ప్రకటించిన వెయ్యి కోట్లు యాది మరిచిండా అని ఆరోపించారు.

శాసనసభ్యునిగా అసెంబ్లీ సాక్షిగా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల పంట భూములు పోగొట్టుకున్న రైతులకు, కోరుగడ్డ రైతులకు నష్ట పరిహారం పెంచాలని అడిగినా, పరిహారం చెల్లింపులోనూ సవతి తల్లిప్రేమ చూపెట్టిండని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటల్లో భాగంగానే పదేండ్ల కిందట గీసుమంటి ఇరుకు గదుల్లో ఇంటికి అల్లుడు వస్తే ఏడ పండాలి అని బ్రహ్మాండమైన డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చి కనీసం నియోజకవర్గంలో పది ఏండ్లలో పట్టుమని 200 డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇయ్యలేదని విమర్శించారు.

దళిత బంధు పథకం విషయంలోనూ నియోజకవర్గంలో పథకానికి ఎంపికైన దళితులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ 7 నెలల తిప్పుకొని అనేక ఇబ్బందులకు గురిచేసి, తప్పని పరిస్థితుల్లో ఇచ్చిండ్రు. భద్రాచల నియోజకవర్గ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రాంత వాసుల పై చూపెడుతున్న వివక్షతని గమనిస్తూనే ఉన్నారని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తెలం వెంకట్రావు మాట్లాడుతూ కేసీఆర్ అబద్ధపు హామీలకు నేను జవాబు దారిగా ఉండవలసి వస్తుందనే నేను పార్టీ మారటానికి ముఖ్య కారణం అని అన్నారు. ఇక్కడి ప్రజలను మోసం చేసే వారితో కలిసి నడవలేక కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed