- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'దమ్ముంటే తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి'

దిశ, రఘునాథపాలెం: ప్రపంచానికి అన్నం పెట్టేది భారతదేశమేనని, మన దేశంలో ఉన్న వనరులు ఎక్కడా లేవని, అందులోనూ వ్యవసాయ ఉత్పత్తులకు, అన్ని రకాల పంటలు సాగుకు అనువైన స్థలాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా క్రాస్ రోడ్ వద్ద రూ. 15 కోట్ల వ్యయంతో 20 వేల మెట్రిక్ టన్నుల పంటను నిల్వ చేసే గోదాములను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నదని అందుకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు అందలేదన్నారు. ఈ క్రమంలో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందన్నారు.
గత ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం చెందడంతో పాటు ప్రతికూల వాతావరణం సంభవించిన తరుణంలో పంటలను ఎక్కడ భద్ర పర్చుకోవాలో తెలిసేది కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో ధాన్యాన్ని భద్రపర్చుకోవాలంటే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిన సందర్భం ఉందని గుర్తు చేశారు. కనీసం ప్రయివేటు గోదాములు కూడా అందుబాటులో లేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డ సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల పంటలు నిల్వ చేసే విధంగా గోదాముల నిర్మాణం జరిగిందన్నారు.
రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా..
రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ తో సుమారు ఒక్క రైతుకు సంవత్సరానికి లక్ష రూపాయలుకు పైగా ఖర్చు చేస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇస్తుంది కానీ ప్రభుత్వానికి ఉచితంగా రాదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో రైతులకు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని తెలిపారు. రైతు రాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నో ప్రభత్వాలు రైతే రాజు అన్నారు తప్పితే ఆ దిశగా ఎవరు అడుగులు వేయలేదని ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పై లేని పోని అవాకులు చవాకులు పేలుతుందని, తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశాన్ని పాలిస్తున్న మోదీ గతంలో గుజరాత్ సీఎం ఉన్నారని అప్పుడు ఇప్పుడు అక్కడ ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేక పోతున్నారో తెలపాలన్నారు. రైతు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు అందిస్తుందని, ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామన్నారు. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేక పోతున్నారో డిమాండ్ చేశారు.
తెలంగాణ పథకాలే దేశం కోరుకుంటుంది..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశం మొత్తం కోరుకుంటుందని ఈ క్రమంలోనే కేసీఆర్ దేశ రాజకీయాల వైపు దృష్టి సారించారని తెలిపారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనేక కుట్రలు పన్నుతుందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ మాయమాటలు నమ్మరన్నారు.
కరోనా ప్రభావంతో దేశం మొత్తం అతలాకుతలం అయిందని ఆర్థిక వెసులుబాటు కోసం కొంత జాప్యం తప్పా ఇన్ని పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి రుణమాఫీ పెద్ద సమస్య కాదన్నారు. రానున్న రోజుల్లో రుణమాఫీ పై ప్రత్యేక ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, తెలంగాణ గిడ్డంగుల చైర్మన్ సాయి చందర్, గిడ్డంగుల ఎండీ జితేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.