ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతిపై మంత్రి పువ్వాడ ఏమన్నారంటే...?

by S Gopi |   ( Updated:2022-11-22 13:37:44.0  )
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతిపై మంత్రి పువ్వాడ ఏమన్నారంటే...?
X

దిశ, ఖమ్మం: ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై గుత్తి కోయల దాడిలో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన శ్రీనివాసరావు మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావుపై గొత్తికోయలు(వలస ఆదివాసులు) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. శ్రీనివాసరావు ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని, ఆయ‌న కుంటుబ సభ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించింది.

వారి స్వస్థలం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో బుధవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అత్యక్రియల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు. పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో ప‌ని చేస్తుంటే, విధి నిర్వహణ‌లో ఉన్న అధికారుల‌పై దాడులు చేయ‌డం స‌రికాద‌ని మంత్రి పువ్వాడ అభిప్రాయపడ్డారు. అట‌వీ ఆక్రమ‌ణ‌ల‌ను స‌హించేది లేద‌ని, ఆక్రమ‌ణ‌దారుల‌పై చ‌ట్టప‌రమైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు. అట‌వీ అధికారులు మ‌నోస్థైర్యం కొల్పోవ‌ద్దని మంత్రి ధైర్యం చెప్పారు. దాడి చేసిన వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా చూస్తామ‌న్నారు.



Next Story

Most Viewed