ఆదివాసీ గ్రామాల పై ఏరియల్ బాంబింగ్ సిగ్గుచేటు...

by Sumithra |
ఆదివాసీ గ్రామాల పై ఏరియల్ బాంబింగ్ సిగ్గుచేటు...
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : ఆదివాసీలపై జరుగుతున్న బాంబు దాడులను ఖండించండి, ఏరియల్ బాంబింగ్ సిగ్గుచేటు అంటూ మంగళవారం అమావాస్య కార్యదర్శి ఆజాద్ ఒక లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో అమిత్ షా నాయకత్వంలో మనువాద బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ప్రహారను మొదలు పెట్టి ఐదు సంవత్సరాలు కావస్తుందని, ఈ ఐదు సంవత్సరాలలో చత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంతంలో అనేక దాడులకు పాల్పడింది. మావోయిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రజలు, పీఎల్టీఏ బలగాలు ఈ దాడులను తిప్పికొడుతూ గట్టి సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 11న తమ పార్టీ నాయకుడు గెరిల్లా యోధుడు ఇడ్మాను అంతమొందించే లక్ష్యంతో డ్రోన్ దాడికి దిగారు. ఇడ్మా హతం అని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు చంకలు గుద్దుకున్నాయి.

కేంద్రప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించి మీడియాలో గట్టిగా ప్రచారం చేసింది. ప్రజలు పార్టీకి అండగా ఉన్నంత కాలం ఏ పోలీసులు.. ఏ ప్రభుత్వం తమ పార్టీని ఏమి చేయలేరని గుర్తు చేస్తున్నాం. ఇలాంటి దాడులను పార్టీ నాయకత్వంలోని పీఎల్డీఏ దీటుగా ఎదుర్కొని, గట్టిగా బుద్ధి చెప్పింది. 2023 జనవరి దాడి ఇంకా మర్చిపోక ముందే ఏప్రిల్ 7న మల్లీ తెల్లవారు జామునుంచే ఏరియల్ బాంబింగ్ చేశారు. దక్షిణ బస్తర్లోని పామేడ్ ప్రాంతంలోని భట్టిగూడ, కావుర్ గట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాలలో, పొలాలు, గడ్డివాములు, అడవులు, పర్వతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, హెలికాప్టర్లు ఉదయం 6:00 గంటల నుంచి భీకర బాంబు దాడులు, కాల్పులు జరుపాయి. ప్రస్తుతం బస్తర్ ప్రాంతంలో ఇప్పపూలు, ఇప్పగింజల కోసం ప్రజలు ఎక్కువగా అడవులు, తమ పంట పొలాల్లో పగలు, రాత్రి అక్కడే గడుపుతారు.

ఈ దాడులతో సామన్య ప్రజానీకం, ఆదివాసీలు భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఇందుకోసం దండకారణ్యమంతా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి, భూమి నుంచి ఇన్ ఫార్మర్ల ద్వారా వైమానిక దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి నీరు- అడవి- భూమి, వనరులను లాక్కోవాలని, స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్సా పెట్టుబడిదారులు, బహుల జాతి కంపనీలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రజాయుద్ధం కారణంగా ఒప్పందాలు అమలు కావడం లేదు. అందుకే మావోయిస్టు పార్టీని ఇక్కడ ప్రజాయుద్ధానికి, ప్రజాఉద్యమాలకు నాయకత్వం వహించకుండా నిర్మూలించాలని ప్రభుత్వాలు కలలు కంటున్నాయి. త్వరలో దాన్ని రూపుమాపేందుకు ఈ దాడులను వేగవంతం చేస్తున్నారు.

నీరు-అడవి-భూమి, విలువైన ఖనిజ సంపదతో పాటు ఆదివాసీ సంస్కృతి సంప్రదాలు కాపాడేందుకు మా పార్టీ నిర్విరామంగా శ్రమిస్తుంది. ఈ దాడులకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ప్రజలపై రాజ్యాంగ విరుద్ధమైన గాలింపులను, బాంబు దాడులను తీవ్రంగా ఖండించాలని పిలుపునిస్తున్నాం. అడుగడుగునా ఏర్పాటు చేసిన కేంద్ర సాయుధ బలగాలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.. సంపద కాజేసేందుకు పాలకులు కార్పోరేట్ కంపనీలకు మధ్యవర్థులుగా మారడాన్ని ఖండించాలి. బస్తర్ ఆదివాసి గ్రామాలపై జరుగుతున్న దాడులను భారతీయులందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిస్తున్నాం. దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని రూపొందించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుంది. అంటూ ఆజాద్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.



Next Story