మండలాలు ఏర్పాటు చేయాలి : న్యూడెమోక్రసీ డిమాండ్​

by Sridhar Babu |
మండలాలు ఏర్పాటు చేయాలి : న్యూడెమోక్రసీ డిమాండ్​
X

దిశ ,ఇల్లందు : కొమరారం , బోడు కేంద్రాలుగా మండలాలను ఏర్పాటు చేయాలని, ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇల్లందు మండలం కొమరారంలో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం మండల సాధన కమిటీ కన్వీనర్ వాంకుడోతు మోతీలాల్ అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఈ బహిరంగసభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా,గుండాల ఎంపీపీ ముక్తి సత్యం,లక్ష్మిదేవిపల్లి జెడ్పీటీసీ మేరెడ్డి వసంత, న్యూడెమోక్రసీ మహాబాద్ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కొమరారం బోడు ప్రాంతాలు వెనుకబడ్డాయని, నూటికి నూరు శాతం షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయని, 80 శాతం మంది ప్రజలు ఆదివాసీ గిరిజనులేనని, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలని, వీటిని ప్రభుత్వం మండలాలుగా గుర్తించకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాంటి అర్హతలు లేకున్నా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను మండలాలుగా గుర్తించారని, కానీ అర్హతలున్న కొమరారం, బోడులను మండలాలుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. వీటిని మండలాలుగా గుర్తించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రస్తుత మండల కేంద్రాలకు కొమరారం ప్రాంతం సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని, రాకపోకలకు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని బోడు, కొమరారంలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నూతన మండలాల సాధనకై ఈ ప్రాంత ప్రజలు ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులు కె.సారయ్య, టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం జిల్లా నాయకులు యదలపల్లి సత్యం, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సతీమణి లక్ష్మి, లాయర్ సూరబాక సత్యనారాయణ, మాజీ ఆత్మ చైర్మన్ ముక్తి కృష్ణ, సర్పంచులు శ్రీను, మోకాళ్ల కృష్ణ, బానోతు సంతు, సరోజిని,రజిత, తాటి చుక్కమ్మ, ఎంపీటీసీ ఈసాల పాపమ్మ, కృష్ణ ప్రసాద్, సురేందర్, న్యూడెమోక్రసీ ఇల్లందు మండల సహాయ కార్యదర్శి చింతా ఉదయ్, అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీరాములు,చిరంజీవి, జోగ కాంతారావు, ఎట్టి నర్సింహా రావు, పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి ఇర్ప రాజేష్, నాయకులు మూడు మాలు, జోగ కృష్ణ, మంగ్యా, సీతారాములు, కోటన్న, లక్ష్మ, హజ్య, రాంబాబు, రవి, ప్రవీణ్, తారచందు, బహుసింగ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed