- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నోటీసులకే పరిమితం.. చర్యలు శూన్యం

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో అనుమతి లేని అక్రమ నిర్మాణాలు రోజురోజుకు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది భవనాలు నిర్మిస్తుంటే, మరి కొంతమంది పూర్తిస్థాయి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతి లేని భవనాలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కేవలం నోటీసులకే అధికారులు పరిమితమవుతున్నారు. చర్యలు తీసుకోకుండా మేన మేసాలు లెక్కిస్తున్నారు. నోటీసులు ఇచ్చాము.. మా పని అయిపోయింది అన్నట్లు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే ఉన్నతాధికారులకు అక్రమ భవనాల నిర్మాణాల గురించి ఫిర్యాదు చేశామని వారు పట్టించుకోవడం లేదంటూ తప్పును వారిపై నెడుతున్నారు.
వైరా లోని ఎస్బిఐ టౌన్ బ్రాంచ్ భవనంపై అక్రమంగా చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకునే వారు కరువయ్యారు. ఈ భవనంపై రెండవ అంతస్తును 10 సంవత్సరాల క్రితం నిర్మించారు. మూడో అంతస్తును ఆరు నెలల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఈ విషయమై దిశ పత్రికలో సోమవారం అంతా ఇష్టరాజ్యం అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో వైరాలో అక్రమ భవన నిర్మాణంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ భవనానికి అనుమతులు లేవని నెల రోజుల క్రితమే నోటీసులు జారీ చేశామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. మరి నెల రోజుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవన యజమానిపై అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులకే అధికారులు పరిమితమయ్యారు. ఈ భవన యజమానిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకునే వారెవరు అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. మున్సిపాలిటీ అధికారులు మేము నీతి నిజాయితీలతో పని చేస్తామని చెప్పుకుంటున్నారు. అలాంటి అధికారులు నెల రోజుల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదో మున్సిపాలిటీలోని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
అధికారులారా.. ఈ ప్రశ్నలకు జవాబు ఏది..
ఎస్బిఐ బ్యాంకుపై ఆరు నెలల క్రితం అనుమతులు లేకుండా మూడో అంతస్తు నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే 80% పైగా పనులు పూర్తయ్యాయి. ఈ భవనానికి అనుమతులు లేవని అధికారులకు తెలుసు. మున్సిపాలిటీ ఆఫీస్కు కూత వేటు దూరంలో భవనాన్ని నిర్మించారు. మరి మున్సిపాలిటీ అధికారులకు ఆరు నెలలుగా ఈ భవన నిర్మాణం కనిపించలేదా అనే ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. అంతేకాకుండా సదరు భవన యజమాని అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్ దిశకు తెలిపారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అనుమతులు రాలేదన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అనుమతులు లేకుండా భవన నిర్మాణం ఆరు నెలలుగా చేపట్టిన మున్సిపాలిటీ అధికారులకు ఆ పనులు కనిపించలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నెల రోజుల క్రితం నోటీసులు ఇచ్చామని చెబుతున్న మున్సిపాలిటీ అధికారులు.. చర్యలు ఇంతవరకు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాల్సి ఉంది. అనుమతి లేకుండా ఖమ్మం ప్రధాన రహదారి పక్కన నిర్మించిన ఈ భవనము పనులు ఆరు నెలలుగా తెలియకుండా గుట్టుచప్పుడుగా జరిగాయంటే నమ్మశక్యంగా లేదు. అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఆరు నెలలుగా నిర్మించిన అక్రమ భవన పనులను పరిశీలించకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. మున్సిపాలిటీలోని అనేక మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నిరంతరం బిల్ కలెక్టర్లతో పాటు ఇతర సిబ్బంది వార్డుల్లోపర్యటిస్తుంటారు. వారికి కూడా ఈ అక్రమ భవన నిర్మాణం గురించి తెలియదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి. నిజాయితీగా పనిచేసే అధికారులమని చెప్పుకునే వారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం: భాస్కర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్
వైరా లోని ఎస్బిఐ టౌన్ బ్రాంచ్పై అనుమతి లేకుండా నిర్మించిన భవనానికి సంబంధించిన యజమానికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ఈ భవన నిర్మాణం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. అదేవిధంగా తహసిల్దార్కు ఈ అక్రమ భవనం గురించి వివరించాం. నేను పారదర్శకంగా నీతివంతంగా పనిచేస్తున్నాను. చర్యలు తీసుకోవాల్సింది ఉన్నతాధికారులే.