'అతడిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయి'

by S Gopi |   ( Updated:2022-08-20 15:30:28.0  )
అతడిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయి
X

దిశ, ఖమ్మం రూరల్: 'మా నాన్న(తమ్మినేని కృష్ణయ్య) మర్డర్ కేసును పోలీసులు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మర్డర్ జరిగినప్పుడు స్పాట్ లోనే ఉన్న కోటేశ్వరరావు మా నాన్న మృతి చెందాడని కన్ఫామ్ చేసుకున్నాకే తెల్దారుపల్లి నుంచి వెళ్లాడు' అని కుమారుడు తమ్మినేని నవీన్​ఆరోపించారు. తాము చేసిన ఫిర్యాదులో ఏ1గా కోటేశ్వరరావు, ఏ8గా ఎల్లంపల్లి నాగయ్య పేర్లు ఉండగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో లేకుండా చేశారని కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు.

శనివారం కృష్ణయ్య కూతురు రజిత, కుమారుడు నవీన్ విలేకరులతో మాట్లాడుతూ.. తమ తండ్రి హత్య కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో కోటేశ్వరరావు ప్రస్తావన లేకపోవడం పోలీసులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

కోటేశ్వరరావు, నాగయ్య పేర్లను ఎందుకు తప్పించారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోటేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేసి ఏ1 గా చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కేసులో కోటేశ్వరరావును తప్పిస్తే న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే ప్రైవేట్ కేసు దాఖలు చేస్తామని చెప్పారు.

ఇప్పటికైనా పోలీసులు స్పందించి కోటేశ్వరరావు ఆగడాలకు చెక్ పెట్టకపోతే ఇంకా ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుందన్నారు. కోటేశ్వరరావు కుటుంబం వల్ల తాము నష్టపోతే ప్రభుత్వం తమ్మినేని వీరభద్రానికి సెక్యూరిటీ కల్పించారని విమర్శించారు. తమ తండ్రిని కొల్పోయిన ఉన్న తమకు పోలీసులు సెక్యూరిటీ కల్పించాలని కోరారు. ఊరి ప్రజలకు తమ తండ్రి న్యాయం చేశారని, 60 ఏళ్ల వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక పిరికిపందల్లా హత్య చేశారని ఆరోపించారు.

కృష్ణయ్య కుటుంబానికి ఓదార్పు...

కుటుంబ పెద్దను పోగొట్టుకుని శోక సంద్రంలో ఉన్న కృష్ణయ్య కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్​లు ఓదార్చారు. తాము అండగా ఉన్నామని, పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాను ఎప్పుడు వ్యక్తుల కంటే పార్టీ లైన్లోనే పని చేస్తానన్నారు. పోలీసులు తప్పకుండా న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యం క్రిష్ణరావు, అక్కినపల్లి వెంకన్న, లక్ష్మణ్, ఉదయ్, మట్టా వెంకటేశ్వరావు, భాస్కర్​రావు, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, రవికుమార్, రమేష్​తదితరులు ఉన్నారు.



Next Story