- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రసవత్తరంగా ''కొత్తగూడెం'' పాలిటిక్స్.. సీపీఐతో పొత్తు ఆ ముగ్గురికి నష్టమే..?

దిశ, కొత్తగూడెం: రాష్ట్ర రాజకీయాలు ఒకలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు వాటికి పూర్తి భిన్నంగా గోచరిస్తాయి. అందులోను కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాలు ఊహకందని రీతిలో మారిపోతుంటాయి. కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ కంచుకోటగా విరాజిల్లిన కొత్తగూడెం నియోజకవర్గం 2009లో సీపీఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు పట్టం కట్టి వినూత్న తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి అయిన జలగం వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే ఒక టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కొత్తగూడెం నియోజకవర్గం చరిత్రలో నిలిచింది.
కొత్తగూడెం సీటు గల్లంతు..?
గత కొంతకాలంగా సీపీఐ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో జతకట్టి పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే పొత్తు కొనసాగితే కొత్తగూడెం నియోజకవర్గంలో రోజురోజుకీ పట్టును కోల్పోతున్న ఎర్ర జెండాకు కాస్త బలం చేకూరినట్లు అవుతుంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాల్సిన నాయకులు సిద్ధాంతాలను మరచి తమ స్వప్రయోజనాల కోసం పార్టీని అడ్డం పెట్టుకోవడంతో కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ కేడర్ రోజురోజుకీ తగ్గుతుందన్న వాదనలు లేకపోలేదు. గతంలో పేద వారి పక్షాన ఉద్యమాలు చేసిన నాయకులు కంటితుడుపు కార్యక్రమాలకు మాత్రమే తారసపడడం వంటి అనేక అంశాలు సీపీఐ క్యాడర్ తగ్గుముఖం పట్టడానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పొత్తుతో సిట్టింగులకు తిప్పలు తప్పవా..?
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో టీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు పొత్తు ఖరారు అయినట్లు అయితే.. సిట్టింగ్ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు తమ పీఠాలను త్యాగం చేయక తప్పని పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు తనయుడు వ్యవహారంలో పడుతున్న తలనొప్పి సరిపోక.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పొత్తు వ్యవహారంతో కొత్త తలనొప్పి వచ్చి పడినట్లయింది. నిన్న మొన్నటి వరకు టీర్ఎస్ పార్టీ మళ్లీ టికెట్ ఇస్తుంది.. ప్రజా ప్రస్థానంలోనే కొనసాగుతా అని చెప్పిన వనమా వెంకటేశ్వరరావు పొత్తు ఖరారు అయ్యి సీపీఐకి టికెట్ ఇస్తే ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అన్న సందేహాలు నియోజకవర్గ ప్రజలను వనమా అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న.
టీఆర్ఎస్ ఆశావాహుల అడుగులు ఎటు వైపు..?
2014లో టీఆర్ఎస్ బి ఫాంతో కొత్తగూడెం నియోజకవర్గంలో అరంగేట్రం చేసిన జలగం వెంకట్రావు 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ప్రత్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై ఓటమి చవి చూసి.. అనంతరం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తనకు ప్రాధాన్యత ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు పార్టీ అధిష్టానం సిట్టింగ్లకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడవ వ్యక్తి గడ్డల శ్రీనివాసరావు.. కేసీఆర్ ఆశీర్వాద బలంతో కొత్తగూడెం టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ టీఆర్ఎస్, సీపీఐ పొత్తు ఖరారు అయినట్లు అయితే టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఎదురు చూస్తున్న వీరికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ టికెట్ వీరికి దక్కనట్లయితే కొంతమంది పార్టీ మారే అవకాశాలు, మరో కొంతమంది పొంగులేటి నిర్ణయాన్ని బట్టి ఆయన వెంట నడిచే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.
కొత్తగూడెంలో కూనంనేని గెలుపు సాధ్యమేనా..?
కొత్తగూడెం నియోజకవర్గం గత ఎన్నికలలో మూడుసార్లు బరిలో నిలిచి ఓటమి చవిచూసిన కూనంనేని సాంబశివరావు మూడవ స్థానం, 5వ స్థానానికి పరిమితం అయ్యారు. కొత్తగూడెంలో అంతంతమాత్రంగానే ఉన్న పార్టీ క్యాడర్ కునంనేని సాంబశివరావుకు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కిన అంతమాత్రాన ఓటు బ్యాంకు పెరుగుతుందన్న నమ్మకం లేదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టీఆర్ఎస్, సీపీఐ పార్టీల పొత్తు ఖరారైనప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు సీపీఐ పార్టీకి మలచడంలో సక్సెస్ అవ్వగలరో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.