తగ్గేదేలే... బీఆర్ఎస్ వర్గాల బల ప్రదర్శనకు సర్వం సిద్ధం

by Sridhar Babu |
తగ్గేదేలే... బీఆర్ఎస్ వర్గాల బల ప్రదర్శనకు సర్వం  సిద్ధం
X

దిశ, వైరా : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలోని రెండు ప్రధాన వర్గాలు బల ప్రదర్శనకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. అందుకు యువనేత కేటీఆర్ జన్మదిన వేడుకలను వేదికగా వాడుకుంటున్నాయి. కేటీఆర్ జన్మదినం సందర్భంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ వర్గాలు పోటాపోటీగా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఈ రెండు వర్గాలు తగ్గేదేలే అంటూ ఒకరికి మించి మరొకరు బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు

ప్రణాళికలు రూపొందించాయి. అయితే ఎన్నికల సీజన్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ వర్గ రాజకీయాలు మేలు చేస్తాయా....? లేదా కీడును కలిగిస్తాయా....? అనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుంది. ఒకేరోజు పోటాపోటీ ర్యాలీ వల్ల నియోజకవర్గ ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సందేశం పంపించాలనుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోటాపోటీ ర్యాలీలతో ఒకవైపు సందడి వాతావరణం నెలకొంటూనే మరోవైపు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్లో ఐక్యతకు బీజం.......

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైరా నియోజకవర్గ కాంగ్రెస్ లో ఐక్యతకు బీజం పడినట్లు అయింది. ఇప్పటికే వైరా నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు కలిసి ఐక్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ అంశంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటీవల వైరాలో కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఈ రెండు వర్గాల వారు కలిసి పనిచేశారు. తాజాగా వైరాలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో కూడా ఈ రెండు వర్గాల వారు ఒకే వేదికను పంచుకున్నారు.

పొంగులేటి తో పాటు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాలోత్ రాందాస్ నాయక్, బానోత్ విజయభాయి తో సహా తామంతా ఐక్యంగా పార్టీ గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రధానం కాదని చేతి గుర్తు ముఖ్యమని సభ ముఖంగా కాంగ్రెస్ శ్రేణులకు ఐక్యత సందేశం పంపారు. అయితే నియోజకవర్గంలో రేణుక చౌదరి వర్గీయుడైన రామ్మూర్తి నాయక్ విడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐక్యంగా నిర్వహించే కార్యక్రమాల సమావేశం రామ్మూర్తి నాయక్ కు

అందటం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాలకు వైరాలోని రేణుకా చౌదరి వర్గానికి చెందిన ఓ ముఖ్య నేతకు మాత్రం సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా పొంగులేటి చేరిక తర్వాత వైరా నియోజకవర్గ కాంగ్రెస్ శిబిరంలో ఐక్యత రాగం వినిపిస్తుంది. మల్లు భట్టి విక్రమార్క వర్గీయులు కూడా పొంగులేటి వర్గీయులతో కలిసి పనిచేసేందుకు మనస్ఫూర్తిగా సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతుంది.

బీఆర్ఎస్ లో పోటాపోటీగా వేలాది మోటార్ సైకిళ్లతో ర్యాలీలకు ప్రణాళిక......

ఒకవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు వర్గ రాజకీయాలను వదిలి పనిచేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ లో వర్గ రాజకీయం తారస్థాయికి చేరుకుంటుంది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఆధ్వర్యంలో వేరువేరుగా సోమవారం వైరాలో వేలాది బైకులతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో కొణిజర్ల మండలం తనికెళ్ల నుంచి వైరా రింగ్ రోడ్డు వరకు వేలాది బైకులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇండోర్ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. అనంతరం వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అన్నదాన కార్యక్రమం జరపనున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం నుంచి వేలాది బైక్లతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ కొమ్ముగూడెం నుంచి ఏన్కూరు మీదుగా పల్లిపాడుకు చేరుకుంటుంది. అక్కడ నుంచి వైరా రింగ్ రోడ్డు వరకు ర్యాలీ కొనసాగుతుంది. అనంతరం రింగ్ రోడ్డు సమీపంలో క్యాంప్ ఆఫీసులో అన్నదానం ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ వర్గాలు వేరువేరుగా పోటాపోటీగా బైక్ ర్యాలీ నిర్వహించడం పార్టీకి లాభం చేకూర్చటం కంటే నష్టం చేకూర్చేందుకే ఎక్కువ అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు తమ బలాన్ని నిరూపించుకునేందుకే బీఆర్ఎస్ వర్గాలు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నాయని బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీల వల్ల వైరాలో ఒకవైపు సందడి వాతావరణం నెలకొనటంతో పాటు మరోవైపు ఉధృత పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. నియోజకవర్గంలో ఒకవైపు కాంగ్రెస్ వర్గ రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యతకు బీజం వేస్తున్న సమయంలో బీఆర్ఎస్ లో పోటాపోటీ బల ప్రదర్శన ర్యాలీలు ఆ పార్టీకి ప్రతికూల వాతావరణం కల్పిస్తాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా బీఆర్ ఎస్ జిల్లా అధిష్టానం కేటీఆర్ జన్మదినం సందర్భంగా వైరాలో బీఆర్ఎస్ వర్గాలు నిర్వహించే బల ప్రదర్శన ర్యాలీలను కట్టడి చేయకుంటే ఈ ర్యాలీల వల్ల ఆ పార్టీకి లాభం ఎంత జరుగుతుందో దేవుడికి ఎరుక కానీ నష్టం వాటిల్లుతుందనే అంశం మాత్రం స్పష్టమవుతుంది.



Next Story

Most Viewed