రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

by Sridhar Babu |
రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి వద్ద గోదావరి శర వేగంగా పెరుగుతుంది. ఎగువనున్న గోదావరి ఉపనదుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 39.20 అడుగులు ఉన్న గోదావరి క్రమంగా పెరుగుతూ... మధ్యాహ్నం 2గంటల సమయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.28 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. తాలిపేరు ప్రాజెక్ట్ 25 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలగా, కిన్నెరసాని ప్రాజెక్ట్ 11గేట్లు ఎత్తి నీటిని వదిలారు.

దీంతో గోదావరి మరింత ఉధృతంగా ప్రవహిస్తూ మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు బావిస్తున్నారు. గోదావరి పెరగడంతో కరకట్ట స్లుయుజ్ లు మూసివేయడం కారణంగా పట్టణంలోని వరద నీరు గోదావరి లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం, రామాలయం పడమర వైపు వరద నీరు వచ్చి చేరింది. వరదలు ప్రత్యేక అధికారి, గత కలెక్టర్ అనుదీప్ భద్రాచలం, తాలిపేరు వద్ద వరద ఉధృతిని పరిశీలించారు.

తీసుకోవాల్సిన తక్షణ చర్యలు గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కారణంగా భద్రాచలం నుండి చర్ల వెళ్లే రహదారి పై కుదునూరు, అర్. కొత్తగూడెం వద్ద వరద నీరు వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్థంభించింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని భద్రాచలం ఏ ఎస్ పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు.



Next Story

Most Viewed