కేసీఆర్ ను ఇంటికి పంపేందుకు ఖమ్మం జిల్లా నుంచే శ్రీకారం

by Sridhar Babu |
కేసీఆర్ ను ఇంటికి పంపేందుకు ఖమ్మం జిల్లా నుంచే శ్రీకారం
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పంపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైరాలోని వాసవి కళ్యాణ మండపంలో వైరా నియోజకవర్గానికి చెందిన వందలాది కుటుంబాల వారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని, వారిలో వారే తన్నుకుంటారని అధికార మదంతో ఉన్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పారు.

వారికి బుద్ధి చెప్పే విధంగా జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతలం అందరం త్వరలో ఒకే వేదికపై వచ్చి ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ ఐక్యత సభ వేదిక కే పరిమితం కాకుండా నిజంగా కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపాలనే ఆలోచన, ఆశయం, లక్ష్యంతో వర్గాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీలోని పాతవారు, కొత్త వారందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. వర్గాల పేరుతో ఆవేశ పూర్వకంగా రోడ్లు ఎక్కవద్దన్నారు. కొట్లాడుకోవటానికి కాంగ్రెస్ పార్టీలోకి మనం చేరలేదనే విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గమనించాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరామని స్పష్టం చేశారు. జిల్లాలో అధికార మదంతో విర్రవీగుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఇంటికి పంపటమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో తనకు పదవి లేకపోవడంతో అనుచరులను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రహింసలకు గురైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సుఖాలు అనుభవించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా....ఎన్నికల్లో ఎత్తులు జిత్తులు వేసినా.... వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని జోష్యం చెప్పారు. కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచే బీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిచ్చి ఎక్కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, నియోజకవర్గ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్, బానోత్ విజయబాయి, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ నాయకులు శీలం వెంకట నర్సిరెడ్డి, లేళ్ళ వెంకటరెడ్డి, గుమ్మా రోశయ్య, దాసరి దానియేలు, గోసు మధు, ఏదునూరి సీతారాములు, మిట్టపల్లి నాగి ఫణితి సైదులు, ఇమ్మడి తిరుపతిరావు, కోసూరు శ్రీను, దొడ్డా పుల్లయ్య, పంది సైదులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed