ఆ కాంట్రాక్టర్ చేతిలో అవినీతి అధికారుల చిట్టా

by Sridhar Babu |
ఆ కాంట్రాక్టర్ చేతిలో అవినీతి అధికారుల చిట్టా
X

దిశ, వైరా : వైరా విద్యుత్ డివిజన్లోని అధికారుల అవినీతి చిట్టా ఓ కాంట్రాక్టర్ చేతిలో ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దీంతో గత ఏడాది కాలంగా ఆ కాంట్రాక్టర్ వైరాలో విద్యుత్ శాఖ సంబంధించిన పలు పనులను పెండింగ్లో పెట్టినా తమ బలహీనతల పుణ్యమా అని అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. అధికారుల లొసుగులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వెరసి వైరాలో విద్యుత్ వినియోగదారులు లో వోల్టేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వైరాలోని పలు ప్రాంతాల్లో ఏడాది క్రితం 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్లతో పాటు నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అయితే ఆ స్తంభాల నుంచి వైర్లు లాగి ట్రాన్స్​ఫార్మర్లకు కనెక్షన్లు ఇవ్వటం మరిచారు. ఈ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏడాది కాలంగా ఆ కాంట్రాక్టర్ తో పనులు చేయించడంలో విఫలమైన విద్యుత్ అధికారులు అతనిపై కనీస చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ చేతిలో విద్యుత్ అధికారుల అవినీతి బాగోతం ఉండటంతో అతనిపై చర్య తీసుకుంటే తమ అవినీతి పుట్ట బయటపడుతుందని విద్యుత్ అధికారులు భయపడుతున్నారు.

ఏడాది క్రితం ట్రాన్స్​ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు....

వైరా లోని ఐదో వార్డ్ లో ఉన్న సాయిబాబా మందిరం వద్ద, కేవీ సీఎం కళాశాల రోడ్డులో, శాంతినగర్ లోని ఎస్సీ కాలనీలో సరిగ్గా ఏడాది క్రితం 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రాంతాలలో సిమెంటు దిమ్మెలు కట్టి ఆ దిమ్మెలపై మూడు 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్​ఫార్మర్ల నుంచి విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభాలను వేశారు. అయితే ఏడాది గడిచినా నేటి వరకు విద్యుత్ స్తంభాలకు లైన్ లాగ లేదు. ట్రాన్స్​ఫార్మర్లకు కనెక్షన్ ఇవ్వలేదు. సుమారు 5 లక్షల రూపాయల ఎన్పీడీసీఎల్ నిధులతో ఏర్పాటు చేసిన ట్రాన్స్​ఫార్మర్లు, స్తంభాలు అలంకారప్రాయంగా మారి దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి.

ఏడాది కాలంగా ట్రాన్స్​ఫార్మర్లకు కనెక్షన్లు ఇవ్వకపోయినా విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పనులను పరివేక్షించాల్సిన వైరా డీఈ, ఏడీ కూడా సమస్య వస్తే ఇబ్బంది పడేది వినియోగదారులే కదా అనుకున్నారో ఏమో.... ఈ సమస్య గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. ఈ మూడు ప్రాంతాల్లో గతంలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్లపై విద్యుత్తులోడు పడి ఫీజులు కాలిపోతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో గతంలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్లకు ఏబీ స్విచ్లు పనిచేయకపోవడంతో ఫీజులు పోయినప్పుడల్లా ఫీడర్ ఎల్సీ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ట్రాన్స్​ఫార్మర్ల ఫీజు పోయిన సమయంలో ఆ ఫీడర్ లోని విద్యుత్ వినియోగదారులందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా విద్యుత్ అధికారులకు మాత్రం కనీస చలనం లేకుండా పోయింది. 20 రోజుల క్రితం వైరా అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ కార్యాలయంలో ఓ అధికారికి, కాంట్రాక్టరుకు మధ్య తీవ్ర వివాదం నెలకొంది. నువ్వెంత అంటే నువ్వెంత, నీ సంగతి చూస్తాను అంటే నీ పని పడతానంటూ వారు ఇరువురు బెదిరించుకునే స్థాయికి సమస్య వెళ్లింది. ఈ వివాదాన్ని పరిశీలిస్తేనే విద్యుత్ అధికారుల అవినీతి భాగోతం ఆ కాంట్రాక్టర్ వద్ద ఉందనే విషయం బహిర్గతం అవుతుంది. వైరా లోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ట్రాన్స్​ఫార్మర్ల లో కాలిపోయిన విద్యుత్ ఫీజులను వేసేందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తున్నారు.

ఇటీవల సాయిబాబా మందిరం వద్ద ట్రాన్స్​ఫార్మర్​ ఫీజు కాలిపోతే గంటన్నర తర్వాత ప్రైవేటు ఎలక్ట్రిషన్ వచ్చి ఫీజు వేసిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఉంది. రాత్రి వేళల్లో ఫీజులు పోయినా ట్రాన్స్​ఫార్మర్లను పర్యవేక్షించాల్సిన ఫోర్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఫీజులు వేయాల్సిన అసిస్టెంట్ లైన్మెన్లు స్థానికంగా ఉండకుండా వారు నివాసం ఉండే ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో ప్రైవేట్ వర్కర్లతో లైన్మెన్ ఒక్కరే రాత్రి వేళల్లో ఫీజులు వేయాల్సి రావటంతో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ సీఎండీ స్పందించి ఏడాది కాలం క్రితం ఏర్పాటు చేసిన ట్రాన్స్​ఫార్మర్లకు కనెక్షన్లు ఇప్పిస్తారో.... లేదా తమ విద్యుత్ అధికారులు చేసేదంతా సక్రమమేనని వెనకేసుకువస్తారో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed