- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యుత్ సమస్యలు వస్తే ప్రైవేట్ వర్కర్లే దిక్కు

దిశ, వైరా : మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన వైరా పట్టణంలో విద్యుత్ సమస్య వస్తే ప్రైవేటు వర్కర్లే దిక్కుగా మారారు. వైరా పట్టణానికి సంబంధించిన విద్యుత్ సిబ్బందితోపాటు, అధికారులు పగలు బ్యాచ్లర్ రూమ్ లో, రాత్రి నాన్ లోకల్ లో ఉంటూ విద్యుత్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైరా పట్టణంలో ఫోర్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ లైన్మెన్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫోర్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ లైన్ మెన్ వైరాలోని సంత బజార్లో ఓ బ్యాచిలర్ రూమ్ తీసుకొని పగలు అక్కడ ఉంటున్నారు.
సాయంత్రం అయితే తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఫోర్ మెన్ ఖమ్మం నుంచి, అసిస్టెంట్ లైన్మెన్ బల్లేపల్లి నుంచి వైరాకు డైలీ సర్వీస్ చేస్తున్నారు. లైన్ ఇన్స్పెక్టర్ ఎక్కడుంటారో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొని ఉంది. వైరా ఏడీ తల్లాడ రోడ్ లోని ఒక హోటల్ పై ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే కేవలం పగలు రెస్ట్ తీసుకునేందుకే ఈ గదిని అద్దెకి తీసుకున్నారు. సాయంత్రం అయితే ఆయన ఖమ్మం వెళ్తున్నారు. వైరా ఏఈ కూడా ఖమ్మం నుంచి డైలీ సర్వీస్ చేస్తున్నారు. ఆయన కూడా పగలు ఉండేందుకు వైరాలో ఓ గదిని అద్దెకి తీసుకున్నారు. డీఈ మాత్రం కుటుంబంతో కొన్ని రోజులు వైరాలో తాను అద్దెకి తీసుకొని ఇంట్లో, మరి కొన్ని రోజులు ఖమ్మంలో ఉంటున్నారు. ఇలా విద్యుత్ శాఖలో వైరాలో పనిచేసే వారిలో ఒకరిద్దరు తప్ప అంతా నాన్ లోకల్ లో ఉంటూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
రాత్రివేళలో ఏ సమస్య వచ్చినా ప్రైవేటు వర్కర్లే దిక్కు....
రాత్రి వేళల్లో వైరా పట్టణంలో ఎలాంటి విద్యుత్ సమస్య వచ్చినా ప్రైవేటు వర్కర్లే దిక్కుగా మారారు. వైరా లోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ సమస్య ఉంది. ప్రస్తుత వేసవికాలంలో ఏసీలు వాడుతుండటంతో రాత్రి వేళల్లోట్రాన్స్ఫార్మర్లపై ఫీజులు కాలిపోతున్నాయి. గత నెల రోజులుగా వైరా మున్సిపాలిటీ 5వ వార్డుల్లో సాయిబాబా మందిరం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్తో పాటు పలుచోట్ల ఫీజులు కాలిపోతున్నాయి. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో సాయిబాబా గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫీజు కాలిపోయింది. అయితే ఆ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ మాదినేని సునీత భర్త మాదినేని ప్రసాద్ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు.
సుమారు గంటన్నర పాటు ఆయన డీఈ తో సహా పలువురు సిబ్బందికి ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. గంటన్నర తర్వాత తీరిగ్గా ప్రైవేటు వర్కర్ మౌలానా వచ్చి ఫీజు వేశారు. ఫోర్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్ లోకల్లో లేకుండా ప్రైవేటు వర్కర్లతో ఫీజులు వేయిస్తున్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించే సమయంలో ప్రైవేటు వర్కర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫోర్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్ కనీసం వైరాలో లేకుండా విద్యుత్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నా విద్యుత్ శాఖలో ఎవరికీ పట్టని పరిస్థితి నెలకొని ఉంది.
వైరా విద్యుత్ శాఖలో అవినీతి అక్రమాలతో పాటు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బాధ్యతారాహిత్య ధోరణి కొనసాగుతున్నప్పటికీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కనీసం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ ఉద్యోగుల సంఘాలు అండదండలతో వైరా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెలకు లక్షలాది రూపాయలు జీతం తీసుకున్న అధికారుల్లో కూడా కనీస బాధ్యత కరువైంది. హెచ్ఆర్ఏ పేరుతో నెలకు వేలాది రూపాయలు పొందుతున్న ఉద్యోగులు స్థానికంగా నివాసం ఉండకపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ సీఎండీ ఈ సమస్యలపై దృష్టి సారిస్తారో లేదా వైరా విద్యుత్ శాఖలోని తప్పులను లైట్ గా తీసుకొని ఎన్పీడీసీ సంస్థ పరువును మరింత దిగజారుస్తారో వేచి చూడాల్సిందే.