- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైరా రిజర్వాయర్లో అక్రమంగా మట్టి తవ్వకాలు

దిశ, వైరా: మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ లో మట్టిని పొక్లేన్ తో తోడేస్తున్నారు. ఒకరోజు నుంచి కాదు... రెండు రోజుల నుంచి కాదు.. ఏకంగా వారం రోజులుగా అక్రమంగా వైరా రిజర్వాయర్ లో పెద్ద పొక్లేన్ తో మట్టిని తోడి ట్రాక్టర్లతో అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా, బహిరంగంగానే ఈ అక్రమ భాగోతం కొనసాగుతుంది. అక్రమంగా తోడుతున్న ఈ మట్టిని సుమారు 12 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేందుకు ఉపయోగిస్తున్నారు. మొత్తం 20 ట్రాక్టర్లతో అక్రమట్టి రవాణా కొనసాగుతోంది. అనుమతి లేకుండా వారం రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి రవాణాపై కనీస చర్యలు తీసుకునేవారు కరువయ్యారు. జిల్లాలోని అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి ఈ మట్టి దందా కొనసాగించడం విశేషం. రిజర్వాయర్లో 10 నుంచి 15 అడుగుల లోతు గుంతలను మట్టి కోసం తవ్వుతున్నారు. ఆ నోట... ఈ నోట పడి అక్రమ రవాణా విషయం మీడియాకు తెలవడంతో నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలికంగా అక్రమ రవాణను అడ్డుకున్నారు.
అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వైరా రిజర్వాయర్ లో మట్టిని తోడేస్తున్నవారిపై నీటిపారుదల శాఖ జిల్లా ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. రైతులు తమ పొలాలకు వైరా రిజర్వాయర్ లోని మట్టిని తోలుకోవటానికి అనేక నిబంధనలు, షరతులు పెడుతున్నా నీటిపారుదల శాఖ వ్యాపారం కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఇది వైరా రిజర్వాయర్ లో కొనిజర్ల మండలం లాలాపురం గ్రామంలో అక్రమార్కులు కొసాగిస్తున్న మట్టి దందా. జిల్లాలోని కొందరు అధికార పార్టీ నేతల పేరు చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండానే వైరా రిజర్వాయర్ నుండి గత వారం రోజుల నుండి అక్రమంగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. కొనిజర్ల మండలం లాలాపురం గ్రామ సమీపంలోని వైరా రిజర్వాయర్ నుండి కొందరు అక్రమార్కులు గత వారం రోజుల నుండి భారీ పొక్లేన్లతో రాత్రి పగలు తేడా లేకుండా లక్షలాది రూపాయల విలువైన మట్టిని అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రవాణా చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూసే అధికారి లేకపోవటం విశేషం. లాలాపురం సమీపంలోని ఓ వెంచర్ కు సుమారు 20 ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో సమీప ప్రాంతాల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఇంత దర్జాగా మట్టి దందా నిర్వహిస్తున్నారంటే అక్రమార్కుల వెనుక కొందరు అధికార పార్టీ నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఐబీ శాఖ అధికారులు మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న సంఘటన స్థలాన్ని సందర్శించి చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. అయితే నీటిపారుదల శాఖ జిల్లా ఉన్నతాధికారి ఒకరు నుంచి స్థానిక అధికారులకు ఫోన్ కాల్ రావడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోయారు. రైతులకు ఉపయోగపడే సారవంతమైన మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లకు తరలిస్తుంటే సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మట్టి దందా నిర్వహిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కనీస చర్యలు శూన్యం...
ఎలాంటి అనుమతులు లేకుండా రైతులు పొలాలకు వైరా రిజర్వాయర్ నుంచి మట్టి తోలుకుంటేనే అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా అక్రమంగా రిజర్వాయర్ నుంచి మట్టి తోలినవారిపై గతంలో పోలీసులకు కూడా అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుత మట్టి దందాపై చర్యలు తీసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. రిజర్వాయర్లలో మట్టిని భారీ స్థాయిలో తోడేస్తున్నా నీటిపారుదల శాఖ జిల్లా అధికారులు అక్రమార్కులకు అండగా నిలవడం పలు విమర్శలకు దారితీస్తుంది. వైరా రిజర్వాయర్లో 10 నుంచి 15 అడుగులు గోతులు పెడుతుండటం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండితే ఈ గుంటలోకి నీరు చేరుతుంది. ఈ గుంట గురించి తెలియక మత్స్యకారులు, స్థానికులు రిజర్వాయర్ లోకి వెళితే మృత్యువాత పడే పెను ప్రమాదం ఉంది. ట్రాక్టర్లు రిజర్వాయర్ నుంచి మట్టి అక్రమ రవాణా చేస్తుండటంతో దుమ్ము లేచి రైతుల పంటలపై పెను ప్రభావం చూపుతుంది. ఇంత జరుగుతున్నా జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించటం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకుంటారో... ఇదంతా మాకు "మామూలే" అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే.