- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైరాలో ఇష్టారాజ్యం...?

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో తవ్విన కొద్దీ అక్రమ భవన నిర్మాణాల బాగోతాలు రోజురోజుకు మరిన్ని బయటపడుతున్నాయి. ఒకటి కాదు.... రెండు కాదు.. అనేక భవనాల నిర్మాణాలకు కనీస అనుమతులు లేవు. మరికొన్ని భవనాలకు పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోలేదు. ఇలా సుమారు 50కి పైగా ఇండ్లు, భవనాలకు పూర్తిస్థాయి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. ఈ అక్రమ భవనాలకు మున్సిపాలిటీ అధికారుల అండ పుష్కలంగా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇదే తరహాలో వైరా నడిబొడ్డున మరో అక్రమ భవన నిర్మాణ బాగోతం బయటపడింది. ఇలా అనేకమంది ఏ ధైర్యంతో అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్నారనేది లక్ష డాలర్ల ప్రశ్నగా మారింది. ఎవరి అండ దండలతో దర్జాగా భవనాలు నిర్మిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నూతన భవన నిర్మాణాలను పరిశీలించాల్సిన డీటీఎస్ టీం అడ్రస్ కనిపించడం లేదు. వైరాలోని ఖమ్మం రోడ్ లో ఎస్బీఐ టౌన్ శాఖ భవనంపై ఎలాంటి అనుమతులు లేకుండా మూడో అంతస్తు నిర్మిస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం కింద భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనం అంత నాణ్యతగా లేదు. ఈ భవనంపై 10 సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ అనుమతితో రెండు అంతస్తులు వేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రస్తుతం మూడో అంతస్తు నిర్మించారు. స్లాబు వేయడంతోపాటు గోడలు నిర్మించి ప్లాస్టింగ్ చేశారు. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు కానీ డీటీఎస్ టీమ్ కానీ ఈ భవన నిర్మాణం గురించి పట్టించుకోవడంలేదు. పాత భవనంపై కొత్త భవనం నిర్మిస్తున్న కళ్ళుండి కబోదుల్లా మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదో తెలిసే పరిస్థితి లేకుండా పోయింది.
రూ. లక్షల్లో అక్రమ వసూళ్లు...
ఈ భవన నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో కొంతమంది లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారని వైరా పట్టణంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిటీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని సదరు వ్యక్తులు లక్షలాది రూపాయలను వసూలు చేశారని బహిరంగ ప్రచారమే జరుగుతుంది. అయితే భవన నిర్మాణానికి అనుమతులు లేవని తెలిసి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతుంది. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఈ భవనానికి కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. తాము డీటీఎస్ టీమ్ కు ఈ అక్రమ నిర్మాణం గురించి రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేశామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసి రెండు నెలలైనా డీటీఎస్ టీం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సామాన్యులకు ఇంటి నిర్మాణ అనుమతి లేకుంటే అపరాధ రుసుము విధించడంతోపాటు అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేస్తామని బెదిరించే అధికారులు ఇలాంటి అక్రమ భవనాల వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం విష్మయాన్ని కలిగిస్తుంది.
పార్కింగ్ కి అంగుళం స్థలాన్ని కేటాయించని వైనం....
వైరా నడిబొడ్డులో సుమారు 500 గజాల్లో గతంలో రెండు అంతస్తులు నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండా 3వ అంతస్తు నిర్మిస్తున్నారు. అయితే ఈ భవనానికి ఒక అంగుళం స్థలం కూడా పార్కింగ్ కేటాయించలేదు. ఈ భవనంలో ఎస్బీఐ టౌన్ బ్రాంచ్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ ఏటిఎంతోపాటు పలు వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలకు బ్యాంకుకు వచ్చేవారికి కనీస పార్కింగ్ సౌకర్యం లేదు. ఆర్ అండ్ బీ రోడ్డు పక్కనే ఇక్కడికి వచ్చే వినియోగదారులు, ఖాతాదారులు వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. మూడో అంతస్తు నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. ఈ భవనాన్ని కమర్షియల్ కోసం నిర్మిస్తున్నారు. ఇప్పటికి ఉన్నవారికే ఎలాంటి పార్కింగ్ లేదు. ప్రస్తుతం నిర్మిస్తున్న నూతన అంతస్తుకు పార్కింగ్ స్థలం కేటాయించలేదు. అయినప్పటికీ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు.
డీటీఎస్ టీం అడ్రస్ ఎక్కడా....?
అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో డీటీఎస్ టీంను ఏర్పాటు చేసింది. అక్రమ నిర్మాణాలను తనిఖీ చేసి ఉక్కుపాదం మోపేందుకు ఈ టీం పని చేయాలి. ఖమ్మంకు కుత వేటు దూరంలో ఉన్న వైరా మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు బీభత్సంగా జరుగుతున్న డీటీఎస్ టీంకు కనిపించడం లేదు. డీటీఎస్ టీంలో సీఐ, తహశీల్దార్, ఆర్ అండ్ బీ డీఈ, ఫైర్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. వీరంతా భవన నిర్మాణాన్ని పరిశీలించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేది ధ్రువీకరించాలి. అలాంటి అధికారాలు ఉన్న అధికారులు ఇటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా డీటీఎస్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణంపై చర్య తీసుకుంటారో లేకుంటే ఇవన్నీ 'మామూలే' అని వదిలివేస్తారో వేచి చూడాల్సిందే.