- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బహుళ అంతస్తు.. బహుళ సహకారం..!

దిశ, ఖమ్మం బ్యూరో: నగరంలో విచ్చలవిడిగా, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు కడుతున్నా కార్పొరేషన్ యంత్రాంగం మాత్రం కళ్ళుండీ చూడలేక పోతుంది. అనుమతి ఒకలా తీసుకుని మరోలా నిర్మాణం చేపడుతున్న పట్టనట్లు వ్యవహరిస్తోంది. మమ్మల్ని అడిగే వారెవరంటూ అక్రమార్కులు రెచ్చిపోతున్నా చర్యలు తీసుకోవడం మానేసి వారితోనే చేతులు కలుపుతుంది. ఖమ్మం నగరంలో కొత్త బస్టాండ్ సమీపంలోని హైవేకి ఆనుకునే ఓ బహుళ అంతస్తు వెలుస్తోంది. అయితే ఈ కట్టడం పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కుతూ.. అధికారుల చేతులు తడుపుతూ.. అధికార పార్టీ నాయకుల అండతో రూపుదిద్దుకుంటుంది.
నగరంలోని ఓ వైద్యుడిదిగా ప్రచారం జరుగుతున్న ఈ బహుళ అంతస్తు నిబంధనలు పాటించకపోవడం ఒకటైతే.. ముందున్న డ్రైనేజీని, వెనుక ఉన్న స్థలాన్ని ఆక్రమించడం, హైవేపై చేపట్టే నిర్మాణాలకు ఉండాల్సిన సెట్ బ్యాక్ లేకపోవడం మరో అక్రమం.. మరి ఇంతటి బహుళ అంతస్తుకు కార్పొరేషన్ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు..? ఎవరి అండతో రెచ్చిపోయి ఇంత పెద్ద కట్టడాన్ని కడుతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు..'సామి' ఇదేందంటూ అడుగుతున్నారు.
ఖమ్మంలోని రాపర్తి నగర్ బైపాస్ రోడ్ కొత్త బస్టాండ్ సమీపంలోని హైవేపై నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ బహుళ అంతస్తుల తో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆ కట్టడానికి తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణానికి సంబంధమే లేదని తెలుస్తోంది. అంతేకాదు అనుమతి లేని సెల్లార్తో పాటు, అదనపు ఫ్లోరు, పెంటౌస్ నిర్మాణం కూడా పూర్తయ్యాయి. దాదాపు ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయినా కార్పొరేషన్ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. చిన్న చిన్న నిర్మాణాలకు మాత్రం అన్నీ ఉన్నా అడ్డంకులు చెప్పే కార్పొరేషన్ అధికారులు మాత్రం ఇంత పెద్ద నిర్మాణం నిబంధనలకు విరుద్దంగా సాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ముందు డ్రైనేజీ.. వెనుక గెస్ట్ హౌస్ స్థలం..
హైవేపై ఈ బహుళ అంతస్తు నిర్మాణం జరుగుతుంది కాబట్టి నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ ఉండాలి.. కాంపౌండ్ కూడా కొంత స్థలం వదలాలి కానీ.. అలాంటిదేమీ లేకుండా కడుతున్నారు. అంతేకాదు.. ఈ కట్టడానికి పక్కనే ఉన్న డ్రైనేజీ ఆక్రమించి మరీ నిర్మిస్తున్నారు. వెనకాల ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించినట్టుగా స్థానికులు చెబుతుండడం గమనార్హం. బహుళ అంతస్తు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న అటు కార్పొరేషన్ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న విషయమై 'దిశ' లోతుగా పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బుకు లోకం దాసోహం అనే తీరుగా వ్యవహారాలు చక్కదిద్దినట్లుగా తెలుస్తుంది.
భారీగా ముడుపులు..
ఈ బడా భవంతి నిర్మాణంలో కార్పొరేషన్ అధికారులతో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులకు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ కట్టడంలో లోపాలను గుర్తించిన ఓ కార్పొరేటర్ సదరు యజమాని వద్ద లక్షల్లో డబ్బు తీసుకుని లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. తానే దగ్గరుండి పనులకు ఎవరు అడ్డు రాకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నిర్మాణం వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేందుకు కార్పొరేషన్ అధికారులకు కూడా భారీగానే డబ్బులు అందినట్లు స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. అందుకే హైవేపై ఇంత పెద్ద అక్రమ కట్టడం నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోక పోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల అండతోనే..
ఈ అక్రమ నిర్మాణానికి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఇంత పెద్ద నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న, ఈ అక్రమ నిర్మాణం పై ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం కాదు కదా.. కనీసం తనిఖీలు కూడా చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అండదండలతోనే ఇంత పెద్ద నిర్మాణం జరుపుతున్నారు. వీరికి అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు.
టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఈ విషయం పూర్తిగా తెలుసునని, తెలియనట్లు నటిస్తున్నారని పలువురు ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ అధికారే ఈ వ్యవహారానికి పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని, తనకు ఆ బిల్డింగ్ అనుమతులకు సంబంధం లేదని తనకంటే ముందుగా ఉన్న అధికారే అనుమతులిచ్చినట్లు చెబుతున్నా.. ఫిర్యాదులు వస్తున్న ఎందుకు స్పందించడం లేదో అతనే చెప్పాలి.
సమాచార హక్కు చట్టానికి తూట్లు..
ఈ కట్టడానికి సంబంధించి ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా ఇంటి నెంబర్ రానందున సమాచారం ఇవ్వడం కుదరని కార్పొరేషన్ అధికారులు చెప్పడం.. ఈ అక్రమ కట్టడంలో వారి వాటా ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా నిర్మాణం పూర్తయితేనే నెంబర్ వస్తుంది. అలాంటిది నంబర్ వచ్చిన తర్వతే సమాచారం ఇస్తామంటే.. నిర్మాణం పూర్తయ్యాక చేసేది ఏమీ ఉండదని, సమాచారం బయటకు రాకుండా కార్పొరేషన్ అధికారులే అడ్డుపడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా లేఖ పెట్టగానే ఆ లేఖలోని సారాంశం బహుళ అంతస్తు యజమానికి, డీల్ కుదుర్చుకున్న కార్పొరేటర్ కు కార్పొరేషన్ సిబ్బందే సమాచారం ఇవ్వడం విశేషం. దాంతో అందరూ కూడబలుక్కుని పూర్తి వివరాలు లేవని రిప్లై ఇవ్వడం కొసమెరుపు.