- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లొంగిపోతే కుటుంబమంతా హ్యాపీ : ఎస్పీ

దిశ, భద్రాచలం : అడవిబాట పట్టిన మావోయిస్టులు లొంగిపోతే వారి కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులతో గురువారం చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన సరెండర్ కౌన్సెలింగ్ మేళాలో ఎస్పీ పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారి మీద ఉన్న రివార్డు నగదు అందజేయడమే గాకుండా వారి పునరావాసానికి అన్నిరకాల చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతోపాటు వారి గ్రామాల అభివృద్ధికి అన్నివిధాలా పోలీసుశాఖ కృషి చేస్తోందని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు వైద్య పరీక్షలు చేయించి అవసరమైన మందులు ఇప్పిస్తున్నామని, భార్యాబిడ్డలు కుటుంబ సభ్యులతో వారు సంతోషంగా ఉంటూ వ్యవసాయం, వ్యాపారం ఇతరత్రా పనులు చేసుకుంటూ ఆనందంగా జీవించే అవకాశం ఉందని తెలిపారు. మావోయిజం వలన కాలం వృథాతప్ప ఒరిగేదేమీ లేదని, మావోయిస్టులుగా ఉన్నంతకాలం దినదిన గండంగా జీవించాల్సిందేనని, వారి కుటుంబ సభ్యుల్లోనూ ఎలాంటి సుఖసంతోషాలు ఉండవన్నారు.
ఇది గ్రహించి పెద్ద క్యాడర్ మావోయిస్టులే లొంగిపోతున్నారని చెప్పారు. లొంగిపోయిన వారి కుటుంబాల్లో ప్రభుత్వం, పోలీసుశాఖ నింపిన ఆనందం ప్రత్యక్షంగా చూసి వాస్తవాలు గ్రహించి అడవిబాట పట్టిన మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పిలుపునిచ్చారు. అటవీప్రాంత మారుమూల గ్రామాల అభివృద్ధికి పోలీసుశాఖ చొరవ తీసుకొని ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి అటవీపల్లెల రూపురేఖలు మారుస్తోందన్నారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులతో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమై లొంగిపోయిన వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ఆఫర్లు వివరించారు. మావోయిస్టులకు మీరే కబురు పంపి లొంగిపోయేలా కుటుంబ సభ్యులే ఒత్తిడి చేయాలని హితబోధ చేశారు. లొంగిపోయి బాగుపడిన వారి కుటుంబాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
చర్ల మండలానికి చెందిన అటవీప్రాంత మావోయిస్టుల కుటుంబ సభ్యులందరినీ ఈ సరెండర్ కౌన్సెలింగ్ మేళాకి రప్పించడంలో చర్ల సీఐ బి.సంతోష్, ఎస్ఐలు టి.వెంకటప్పయ్య, టీవీఆర్ సూరి, సీహెచ్ చంద్రశేఖర్ సఫలీకృతులయ్యారు. ఆశించిన మేరకు కౌన్సెలింగ్ సమావేశం సక్సెస్ కావడంతో ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులంతా సంతృప్తి చెందారు. భద్రాద్రి పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డీ సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, సీఆర్పీఎఫ్ అధికారులు కెకె కన్హర్, ఎం.అరుణ్ కుమార్, చర్ల సీఐ అశోక్, ఎస్ఐలు వెంకటప్పయ్య, సూరి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.