చిట్యాలలో భారీగా గంజాయి పట్టివేత

by samatah |
చిట్యాలలో భారీగా గంజాయి పట్టివేత
X

దిశ, చిట్యాల: సినీ పక్కిలో ఎన్నో రోజులుగా పోలీసుల కళ్ళు కప్పి గంజాయిని అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటించి అక్రమ వ్యాపారం సాగిస్తున్న గంజాయి ముఠాను చిట్యాల పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ముందస్తు సమాచారం మేరకు చిట్యాల శివారులో జాతీయ రహదారి 65పై రైల్వే స్టేషన్‌కు వెళ్లే చౌరస్తా వద్ద గురువారం ఉదయం తెల్లవారుజామున మాటు వేసి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

చిట్యాల పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం మేరకు చిట్యాల పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, చిట్యాల పట్టణ శివారులోని రైల్వే స్టేషన్ కు వెళ్లే చౌరస్తా వద్ద మాటువేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలో భాగంగా ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న టీఎస్ 12 యుడి 2172 నెంబర్ గల డీసీఎం, టీఎస్ 13 ఈవి 2700 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ తెలుపు రంగు కారు వాహనాలను ఆపి పోలీసులు తనిఖీ చేయగా వాటిలో 1.29 కోట్లు విలువచేసే 862.50 కేజీల గంజాయి ప్యాకెట్లు లభించాయి. వెంటనే గంజాయి స్వాధీనం చేసుకొని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారని ఆమె తెలిపారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన మహమ్మద్ హైదర్ అలీ డ్రైవర్ గా పనిచేస్తుండగా అతనికి మరొక డ్రైవర్ ప్రతాప్ పరిచయమయ్యాడు. అతని ద్వారా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివాజీ రాథోడ్ అతని సోదరుడైన వెంకట్ రాథోడ్, వారి బావ మహదేవ్ జాదవ్ పరిచయమయ్యారు. వీరు గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి దానిని హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు అక్రమoగా తరలించి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో తేదీ 6.10.2022 గురువారం ఉదయం శివాజీ రాథోడ్, మహమ్మద్ హైదర్ అలీ కి ఫోన్ చేసి గంజాయి తీసుకొని రావడానికి రాజమండ్రి కి వెళ్లాలని దానికి నీతో పాటు మరో డ్రైవర్ నసీరుద్దీన్ కూడా తోడుగా వస్తున్నారని చెప్పడంతో మహమ్మద్ హైదర్ అలీ సరే అని చెప్పడంతో వారు ఇరువురు కలిసి టీఎస్ 12 యుడి 2172 నెంబర్ గల డిసిఎం‌ను తీసుకొని రాజమండ్రి‌కి వెళ్లారు. అక్కడికి వెళ్లి శివాజీ రాథోడ్ కు ఫోన్ చేశారు. అక్కడ శివాజీకి తెలిసిన వ్యక్తి రాజమండ్రి సమీపంలోని చింతూరు‌లో సురేష్, రమేష్ దగ్గర గంజాయిని తీసుకురమ్మని మహమ్మద్ హైదర్ ఆలీ, నసీరుద్దీన్‌లకు చెప్పారు. దాంతో వీరి వాహనాలలో గంజాయిని లోడ్ చేసుకున్నారు. టీఎస్ 13 EV 2700 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు వెనక డిక్కీలో 72 ప్యాకెట్స్ గంజాయిని నింపుకొన్నారు. అనంతరం డీసీఎం క్యాబిన్ వెనక ఒక చిన్న డబ్బా మాదిరిగా ప్రత్యేకంగా ముందువైపు డోర్ తెరుచుకునే విధంగా ఒక క్యాబిన్ తయారు చేయించి ఎవరికీ అనుమానం రాకుండా అందులో 358 గంజాయి ప్యాకెట్స్ లోడ్ చేసుకున్నారు.

అనంతరం శివాజీ రాథోడ్, వెంకట్ రాథోడ్, కారు డ్రైవర్ మనోజ్ గురలే, చింటూలు కారులో డీసీఎంకు ఎస్కార్ట్ గా భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్కు వెళుతున్నారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం అందిన ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, చిట్యాల పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి 7.10.2022 శుక్రవారం తెల్లవారుజాము నుండే చిట్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై మాటు వేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా ఉదయం 7 గంటల సమయంలో డీసీఎం‌ను ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా డీసీఎం‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. దీంతో పోలీసులు వెంటనే డీసీఎం తో పాటు దానిలో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహమ్మద్ హైదర్ అలీ, నాసిరుద్దీన్, వెంకట రాథోడ్లను పట్టుబడి చేశారు. కాసేపటికి వెనకాల వస్తున్న షిఫ్ట్ కారును కూడా పోలీసులు ఆపగా వెంటనే కారులోంచి దిగి శివాజీ రాథోడ్, చింటూ పారిపోయారు. డ్రైవర్ మనోజ్ గొరేలే‌ను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం జరిగిందని తెలిపారు. నల్గొండ డీఎస్‌పీ నరసింహారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో పాల్గొన్న నార్కెట్పల్లి సీఐ శివరాం రెడ్డి, చిట్యాల ఎస్ఐ ఎన్ ధర్మ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ సాయికుమార్, ఎండి ఖలీమ్, హోమ్ గార్డ్ యాదయ్య , టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.



Next Story

Most Viewed