ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి : మంత్రి పువ్వాడ

by Sridhar Babu |
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి : మంత్రి పువ్వాడ
X

దిశ, ఖమ్మం : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం మంత్రి విడివోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లతో ధాన్యం సేకరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, రవాణా పట్ల అధికారుల అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని, రైతులు తమ ధాన్యాన్ని సేకరణ కేంద్రాలకు తీసుకువస్తే సేకరించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.

జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు కాగా దాదాపు 2 లక్షల పై చిలుకు ధాన్యం సేకరణ కేంద్రాలకు వస్తుందని అంచనా ఉందని, ఇప్పటి వరకు కేవలం 30వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగిందని మంత్రి తెలిపారు. ధాన్యం సేకరణ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నదని, కొన్ని చోట్ల అకాల వర్షాలు కొనసాగుతుండడంతో సేకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. భారత ఆహార సంస్థ గోడౌన్ ల వద్ద కొంత ఆలస్యం జరుగుతుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఎందుకు ఆలస్యం జరుతుందని అధికారులను నిలదీశారు.

గోడౌన్ ల వద్ద నిల్వ సామర్థ్య లేదని, ధాన్యం సర్దుబాటు చేయడం వల్ల ఆలస్యం జరుగుతుందని అధికారులు నివేదించారు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద గల 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్ ను వినియోగించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసుధన్, డీఆర్డీవో విద్యా చందన, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి విజయ కుమారి, జిల్లా రవాణా అధికారి తోట కిషన్ రావు, అదనపు డీసీపీ సుభాష్ చంద్ర బోస్, ఏసీపీ గణేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్, జిల్లా పౌర సరఫారాల మేనేజర్ సోములు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed