జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

by Sridhar Babu |
జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలి
X

దిశ, భద్రాచలం : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల 13వ రోజు సమ్మె శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వీడి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కరోనా వారియర్స్ గా గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్న ప్రధానమంత్రి, సన్మానం చేసి కౌగిలించుకున్న ముఖ్యమంత్రి కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మల్టీ పర్పస్ విధానాన్ని గ్రామపంచాయతీ కార్మికుల మీద రుద్ది అదనపు పని భారాన్ని మోపిందని అన్నారు.

కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు కోడ్ లుగా తీసుకువచ్చి కార్మికులు పోరాడే హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ కార్మికులు ఉండరు అని నమ్మబలికిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు పూర్తయినా నేటికీ గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయలేదని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు 19వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ నిర్వహిస్తున్న ఈ నిరవధిక సమ్మెలో కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకట రామారావు, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, కోరాడ శ్రీనివాస్, కుంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed