భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

by Vinod kumar |
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో 49.10 అడుగులు ఉన్న గోదావరి రాత్రి 8 గంటలకు 53 అడుగులకు చేరడంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద చివరి ప్రమాద హెచ్చరిక స్థాయికి మించి గోదావరి ప్రవహిస్తుండగా ఈ రాత్రికే గోదావరి వరద భద్రాచలం వద్ద 56 అడుగులకు చేరుకోవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేయడంతో వరద ముంపు ప్రాంతాల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. రాత్రివేళ ఎవరూ వాగులు ఎవరు దాటకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది కాపలా కాస్తున్నారు. వరద పెరుగుతున్న తీరుని బట్టి చర్ల మండలంలో దండుపేట, వీరాపురం, పెద్దపల్లి గ్రామాలు, దుమ్ముగూడెం మండలం లో సున్నం బట్టి, కాశీ నగరం, గంగోలు గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు సిద్ధమైనారు. భద్రాచలం వద్ద గోదావరి చివరి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం వరద సహాయక చర్యలపై దృష్టి పెట్టారు.

రోడ్లు మునక.. నిలిచిన రాకపోకలు

దుమ్మగూడెం మండలం లో తూరుబాక, గంగోలు, రేగుబల్లి, చర్ల మండలంలో కుదునూరు గ్రామాల వద్ద రహదారులను వరదనీరు ముంచడంతో భద్రాచలం నుంచి చర్ల వైపుకి వాహన రాకపోకలు నిలిచిపోయినవి. దీంతో అత్యవసర ప్రయాణీకులు ఆర్లగూడెం అటవీమార్గం మీదుగా చర్ల నుంచి భద్రాచలానికి టాటా మేజిక్‌లు, ఆటోలలో ప్రయాణిస్తున్నారు. అయితే ఇదే అవకాశంగా ప్రైవేటు వాహనాల వారు భారీగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. మామూలు రోజుల్లో చర్ల నుంచి భద్రాచలానికి రూ 70 వసూలు చేసే ప్రైవేటు వాహన దారులు చుట్టూ తిరిగి రావడం అనే వంకతో ఒక్కొక్కరి నుంచి రూ 200 వసూలు చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ధరలు పెంచకుండా అధికారులు నియంత్రించాలి..

గత నెలలో గోదావరి వరద సమయంలో నిత్యావసర సరుకులను బ్లాక్ చేసి వ్యాపారులు ధరలు పెంచి అమ్మిన దృష్ట్యా ఈసారి ధరలు పెంచకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాపారులు దోచుకోవడం సరైందికాదని అభిప్రాయం వరద ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.



Next Story

Most Viewed