ప్రధాన రహదారిపై గోదావరి

by Sridhar Babu |
ప్రధాన రహదారిపై గోదావరి
X

దిశ, దుమ్ముగూడెం : మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒకపక్క, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న గోదావరి వరద మరోపక్క కలిసి భద్రాచలం ప్రధాన రహదారిని పలుచోట్ల ముంచెత్తాయి. దీని కారణంగా బుధవారం భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని బుర్రవేముల - గంగోలు గ్రామాల మధ్య గల ప్రధాన రహదారి నీటిలో మునిగిపోగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కుదునూరు - పర్ణశాల రహదారి గోదావరి వరదలో మునిగి చర్ల - దుమ్ముగూడెం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తూరుబాక బ్రిడ్జి వద్ద వరద ఉధృతంగా ఉంది.

గుబ్బలమంగి వాగుకు వర్షం నీరు పోటెత్తడంతో పెదనల్లబల్లి - కే లక్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సున్నం పట్టి గ్రామం చుట్టూ వరద చేరుకుంది. గంట గంటకి పెరుగుతున్న గోదావరి వరద, కురుస్తున్న భారీ వర్షంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో వరద పెరుగుతుందని, వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని మండల అభివృద్ధి అధికారి ముత్యాలరావు, తహసీల్దార్ మనిధర్, సీఐ దోమల రమేష్ ప్రజలకు సూచించారు.



Next Story