రెట్టింపు డబ్బులు వస్తాయని ఘరానా మోసం

by Sridhar Babu |
రెట్టింపు డబ్బులు వస్తాయని ఘరానా మోసం
X

దిశ, వైరా : అత్యాశకు పోయిన ఓ యువకుడు లక్షలాది రూపాయలను నష్టపోయాడు. తాను పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు డబ్బులు వస్తాయని ఓ కిలాడీ లేడి చెప్పిన మాటలు నమ్మి ఆ యువకుడు నిండా మునిగాడు. రెట్టింపు డబ్బులు దేవుడెరుగు పెట్టుబడి పేరుతో ట్రాన్స్​ఫర్ చేసిన 7.80 లక్షల రూపాయల నగదు లూటీ కి గురయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వైరా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైరాలోని పాత బస్టాండ్ కు చెందిన యువకుడు చౌడవరపు ఫణి కుమార్ ఓ కిలాడీ లేడీ చెప్పిన మోసపు మాటలు నమ్మి లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నాడు.

వైరా లోని పాత బస్టాండ్ సెంటర్లో నివాసముంటున్న చౌడవరపు రాజమోహన్ రావు వెంకటరమణ మెడికల్ షాపును నిర్వహిస్తున్నారు. అతని కుమారుడు చౌడవరపు ఫణికుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఫణి కుమార్ ఫోన్ కు ఈ నెల 23వ తేదీన రేష్మ అనే యువతి (మొబైల్ నెం. 9666596428) ఫోన్ నెంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. మీరు హెచ్సీఎల్ టెక్నాలజీ నుండి పార్ట్ టైం ఉద్యోగం ద్వారా రోజుకు రూ. 1000 నుండి రూ.2500 డబ్బులు సంపాదించే అవకాశం ఉందని మెసేజ్ వచ్చింది. అనంతరం ఫణి కుమార్ కు ఉన్న మరో ఫోన్ నెంబర్ ను టెలిగ్రామ్ గ్రూపు అయిన 999 గ్లోబల్ వర్క్ గ్రూప్ లో యాడ్ చేసింది.

తరువాత ఆ గ్రూపులో ఆ యువతి యూట్యూబ్ వీడియోలు పంపించి ఫణి కుమార్ ను ఆ వీడియోలు చూడమని చెప్పింది. ఆ వీడియోలు ఫణి కుమార్ చూడగా ఒక్కొక్క వీడియోకు రూ.50 చొప్పున 20 వీడియోలకు రూ.1000 నగదును ఫణి కుమార్ బ్యాంకు అకౌంటుకు ట్రాన్స్​ఫర్ చేసింది. ఆ తరువాత మీరు ఒక వెబ్సైట్లో ( nasdug-india-sita.pages dev) రిజిష్టర్ కావాలని టెలీగ్రామ్ ద్వారా అ యువతి మరలా మెసేజ్ చేసింది. మీరు ఇందులో పెట్టుబడి పెడితే తాము మీ డబ్బును రెట్టింపు చేసి ఇస్తామని ఆ యువతి ఫణి కుమార్ కు అత్యాశ చూపింది. దాంతో అతను మార్చి 23వ తేదీన రూ.5,000 యూపీఐ ద్వారా ఆమెకు పంపారు.

ఆ తరువాత రూ.30,000 యూపిఐ ద్వారా పంపించాడు. అనుమానం వచ్చి నగదును విత్ డ్రా చేసుకుంటానని ఫణి కుమార్ ఆమెను కోరగా ఈ నగదును విత్ డ్రా చేయడం కుదరదని ఆమె తెలిపింది. మీరు మూడు టాస్క్​ల ను పూర్తి చేస్తేనే మీ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో మళ్లీ 90,000 పంపించాలని ఆమె చెప్పగా రూ. 40 వేలు ఒకసారి, రూ.50 వేలు రెండవసారి మొత్తం రూ. 90 వేలను అదే రోజు ఫణి కుమార్ పంపాడు. మరో టాస్క్​కు రూ.3 లక్షల 50 వూలు పంపించాలని ఆమె సూచించగా అదే రోజు ఆమె పంపించిన బ్యాంకు అకౌంటుకు రూ.3,50,000 లను ఫణి కుమార్ ట్రాన్స్​ఫర్ చేశారు.

ఇలా అనేక టాస్క్​ల పేరుతో మొత్తం 7.80 లక్షల రూపాయలను ఫణి కుమార్ ఆమె అకౌంట్ కు ట్రాన్స్​ఫర్​ చేశారు. మరలా అమౌంట్ ను ట్రాన్స్​ఫర్ చేయాలని ఆమె ఫణి కుమార్ ను ఒత్తిడి చేసింది. దీంతో అనుమానం వచ్చిన ఫణి కుమార్ విచారణ చేయగా అది నకిలీ వెబ్సైట్ అని తేలింది. తాను మోసపోయానని గ్రహించిన ఫణి కుమార్ సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం సైబర్ క్రైమ్ అధికారులకు తాను నగదు బదిలీ చేసిన అకౌంట్ నెంబర్ వివరాలను పంపాడు. ఈ విషయమై ఫణి కుమార్ మంగళవారం వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed