బండ బాదుడు.. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది చేతివాటం

by Sumithra |
బండ బాదుడు.. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది చేతివాటం
X

దిశ, కారేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ల పై గ్యాస్ ఏజెన్సీలు గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి 100 రూపాయల వరకు దోచుకుంటున్నారు. మండలంలోని గ్రామాలకు ఇల్లందు, కామేపల్లి, ఖమ్మంలోని గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రూ.892 కు అందిస్తుండగా గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి అదనంగా వసూలు చేస్తూనే చిల్లర లేదని సాకుతో మరో 10 నుండి 20 రూపాయల వరకు అదనంగా దండుకుంటున్నారు. అమాయక గ్రామీణ ప్రజల నుంచి అదనంగా డబ్బులు దండుకుంటున్న గ్యాస్ ఏజెన్సీల బాయ్స్ పై గ్రామీణ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ తీసుకుంటున్న డబ్బుల పై పలుమార్లు ప్రశ్నించిన అప్పుడు మేము రాలేదని దాటు వేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

ప్రతిసారి గ్యాస్ తీసుకున్నప్పుడల్లా అదనంగా వసూలు చేస్తున్నారని దీనిపై గట్టిగా అడిగితే గ్యాస్ ధర పెరుగుతుందని అందుకే తీసుకుంటున్నట్లు తెలుపుతున్నారని ప్రజలు అంటున్నారు. పేద ప్రజలకు సబ్సిడీ పై అందిస్తున్న గ్యాస్ ను గ్యాస్ ఏజెన్సీలు మాత్రం బాయ్స్ తో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ లూటీ చేస్తున్నారని సమాచారం. గతంలో సైతం గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేసే గ్యాస్ ఏజెన్సీలు బండ పై అదనంగా బాదుతున్నారని ఆరోపణలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ప్రశ్నించేవారు ఉండడంతో గ్యాస్ ఏజెన్సీలు గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను ఆసరగా చేసుకుని సిలిండర్ల పై అధికంగా తీసుకుంటూ మోసం చేస్తున్నారని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. సిలిండర్ పై అధికంగా డబ్బులు తీసుకుంటున్న గ్యాస్ ఏజెన్సీల పై ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రజల నుంచి అదనంగా తీసుకుంటున్న డబ్బుల పై చర్యలు తీసుకుని మరో మారు ఇలా జరగకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

గ్యాస్ ఏజెన్సీలు అదనంగా డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు : పవన్ కుమార్ సివిల్ సప్లై ఆర్ఐ

గ్యాస్ సిలిండర్ పై అదనంగా డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరనే గ్యాస్ ఏజెన్సీలు తీసుకోవాలి. ఒక్క పైసా అదనంగా తీసుకున్నట్లు తెలిస్తే విచారణ చేపట్టి ఏజెన్సీల పై చర్యలు తీసుకుంటాం.



Next Story