- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీఆర్ఎస్ నుండి మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షలు

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని చీమలపాడు గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఎంపీ నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ వేదికకు చేరుకొని ప్రారంభం అయ్యే దశలో సభకు 200 మీటర్ల దూరంలో తాటి గుడిసెలో ఉన్న సిలిండర్ పేలి ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఒక్కసారిగా పేలిన సిలిండర్ వల్ల సుమారు ఏడుగురు గాయపడ్డారని దానిలో ఇద్దరు చనిపోయినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో పార్టీ కుటుంబ సభ్యులను కోల్పోయిందని ఈ సంఘటన విషయం ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ల దృష్టికి వెళ్లగానే స్పందించిన వారు పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షలు, క్షతగాత్రులకు రూ 2.లక్షలు ప్రకటించడం జరిగిందన్నారు. అంతేకాక మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలతో సహా క్షతగాత్ర కుటుంబాలకు కూడా మరింత సహాయం అందిస్తామని హామీఇచ్చారు. అంతేకాక నామ ముత్తయ్య ట్రస్ట్ తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షలు, గాయాలు పాయలైన వారికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ చీమలపాడులో జరిగిన సంఘటన హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జిల్లాలో మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ మూడు రోజులు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు వంటి కార్యక్రమాలు చేయవద్దని జిల్లా పార్టీ పిలుపునిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ ఘటన జరగటం అత్యంత బాధాకరం అన్నారు. తన తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. రెండు లక్షలు, క్షతగాత్రులకు లక్ష చొప్పున అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నలమల వెంకటేశ్వర్లు, కారేపల్లి మండల నాయకులు అజ్మీర్ వీరన్న పాల్గొన్నారు.