తుమ్మల సరికొత్త వ్యూహం.. అక్కడ టిక్కట్‌ రాకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి 'సై'

by Vinod kumar |   ( Updated:2022-11-11 12:14:49.0  )
తుమ్మల సరికొత్త వ్యూహం.. అక్కడ టిక్కట్‌ రాకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సై
X

దిశ, భద్రాచలం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వార్తల్లో కీలక వ్యక్తిగా మారిపోయారు. నిన్నటి వరకు ఆయన పార్టీ మారవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మీడియా అంతా ఆయన చుట్టే పరిభ్రమించింది. అయితే తాను సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటానని, టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని వాజేడు సభలో స్పష్టం చేయడంతో పార్టీ మార్పు ఊహాగానాలకు తెరపడింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది అటు అభిమానులు, ఇటు రాజకీయ శ్రేణుల్లో మళ్ళీ చర్చనీయాంశమైంది. 2023 ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తానని వాజేడు పర్యటన సందర్భంగా తుమ్మల ముఖ్య అనుచరులతో చెప్పినట్లుగా సమాచారం. ఈసారి గెలిచి కేసీఆర్ అండతో ప్రభుత్వంలో తన స్థానం మళ్ళీ పదిలపర్చుకుంటానని తుమ్మల అనుచరులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

పాలేరు టిక్కెట్ తుమ్మలకు దక్కేనా..?

పాలేరు నుంచి పోటీ చేస్తానని తుమ్మల పదేపదే తన అనుచరుల వద్ద చెబుతున్నా ఆయనకు టీఆర్ఎస్ పార్టీ పాలేరు టికెట్ ఇస్తుందా అనే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కేసీఆర్ ఇచ్చిన భరోసాతో టీఆర్ఎస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని కాదని తుమ్మలకు టిక్కట్ దక్కుతుందా అనేది ప్రశ్న. మరోవైపు ఈసారి వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళతామని సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభలో చెప్పడం తో పాలేరు సీటుని పొత్తులో భాగంగా సీపీఎం అడుగవచ్చని భావిస్తున్నారు.

అయితే గురువారం వాజేడు ఆత్మీయ సమ్మేళన సభలో తుమ్మల మాట్లాడిన తీరు తీవ్ర అసంతృప్తితో ఉన్న అభిమానులను కొంత ఆలోచింపజేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మార్పు చెందుతున్న నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళుతుండగా రాష్ట్రంలో పరిపాలనకు కేటీఆర్‌కి అండగా తుమ్మల వంటి సీనియర్ మంత్రుల అవసరం ఉంటుందని, ఆ కోణంలో పాలేరు టికెట్ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నుంచి తుమ్మలకు ఇప్పటికే ఏమైనా హామీ లభించిందా అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది. ఆ ధీమాతోనే తుమ్మల అందరి ఊహలను తారుమారు చేస్తూ.. కేసీఆర్‌ని పొగుడుతూ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ.. గులాబీ బాస్ దృష్టి ఆకర్షించేలా ప్రసంగించారని అభిమానులు చర్చించుకుంటున్నారు.

టిక్కెట్ రాకపోయినా స్వతంత్ర పోటీకి 'సై'

ఒకవేళ 2023లో టీఆర్ఎస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు కి పాలేరు టిక్కెట్ ఇవ్వకపోయినా ఏ పార్టీలో చేరకుండా కేసీఆర్‌కి విధేయుడిగా ఉంటూనే స్వతంత్రంగానైనా పోటీచేసి గెలిచి తన సత్తా చాటడానికి తుమ్మల సిద్ధమైనారని అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. ఓడిన చోటనే గెలవాలనేది తుమ్మల పట్టుదలగా కనిపిస్తోందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కారు గుర్తు రా(లే)కపోతే పోటీకి 'సై' అంటున్నారు.‌ తన ద్వారా అనేక రకాలుగా లబ్ది పొందిన వారు కష్టకాలంలో అండగా నిలవాల్సి ఉండగా స్వార్థంతో దూరమైనారని, ఏ ప్రయోజనాలు ఆశించని పార్టీ కార్యకర్తలు, అభిమానులే ఇప్పుడు అండగా ఉన్నారని తుమ్మల వాజేడు వేదిక పై చెప్పడం గమనార్హం.

తుమ్మలకు పూర్వ వైభవం వస్తుందని ఆయన అభిమానులు సంపూర్ణ నమ్మకంతో ఉన్నారు. కానీ ఆయన్ని నమ్ముకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధమైన వారిలో ప్రస్తుతం అయోమయం నెలకొంది. తమ నాయకుడికి స్థానం లభిస్తే, ఆ తర్వాత తమకు ఎలాగైనా న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆ నమ్మకమే తనను ముందుకు నడిపిస్తోందని తుమ్మల సభలో చెప్పడం విశేషం.

Read more:

1.తెలంగాణ నేతలకు చంద్రబాబు ఓపెన్ ఆఫర్! కేసీఆర్‌కు చెక్ పెట్టేలా మాస్టర్ స్కెచ్?



Next Story

Most Viewed