పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్

by Sridhar Babu |
పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్
X

దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురైయ్యారు. ఉదయం నుంచి వాంతులు, కడుపునొప్పితో సుమారుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పండుగ సెలవులకి ఇంటికి వెళ్లిన విద్యార్థులు పాఠశాలకు తెచ్చుకున్న తినుబండారాలు, హోమ్ ఫుడ్స్ వల్లే పిల్లలకు వాంతులు అయ్యాయని ప్రిన్సిపాల్ చంద్రబాబు తెలిపారు. అస్వస్థతకు గురైన పిల్లలకు తక్షణమే చికిత్స అందిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు కొందరినికి పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారు.

హోమ్ ఫుడ్స్ వల్లనే అస్వస్థత : ప్రిన్సిపాల్ చంద్రబాబు

సంక్రాంతి పండుగకు తీసుకువచ్చిన హోమ్ ఫుడ్స్ వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పాలేరు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రబాబు తెలిపారు. సంక్రాంతి పండుగకు విద్యార్థులు తమ ఇళ్ల నుంచి తీసుకువచ్చిన తినుబండారాలు పాయిజన్ కావడం వల్ల విద్యార్థులకు విరేచనాలు, వాంతులు, కడుపులో నొప్పి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ఎటువంటి ప్రమాదం లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కందాళ

పాలేరు నవోదయ పాఠశాలలో జరిగిన విషయంపై పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రబాబును ఫోన్​లో ఆరా తీసి డీఎంహెచ్ఓ మాలతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే కందాళ కోరారు. పాఠశాలకు చేరుకున్న జిల్లా స్థాయి అధికారులు విద్యార్థులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో వంట గదిని పరిశీలించి మెనూ చార్టు గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.



Next Story