- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మరో ప్రభుత్వ భూమిపై కన్ను

దిశ, ఖమ్మం రూరల్ : పోలేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వేనెంబర్ 149 లో పద్మావతి గ్రానైట్ యాజమాన్యం అక్రమంగా గ్రానైట్ వ్యర్థాలను తోలుతున్న విషయం తెలిసిందే. దిశ పత్రిక వరుస కథనాలతో బెంబేలెత్తిపోయిన యాజమాన్యం ప్రస్తుతం వ్యర్థాలు పోస్తున్న సర్వే నెంబర్లు కాకుండా మరొక చోటకి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదే గ్రానైట్లో పనిచేసే వాచ్ మన్ భూమి అంటూ చెప్పుకుంటూ, గత మూడు రోజుల నుంచి గ్రానైట్ వ్యర్థాలను మరో ప్రభుత్వ సర్వే నెంబర్లలోకి తోలకాలు జరుపుతున్నారు.
సదర్ వాచ్ మన్ కి ఎలాంటి ప్రభుత్వ పట్టా కానీ, వారసత్వ సంక్రమన కానీ, ప్రభుత్వం జారీ చేసిన తెలంగాణ పాస్ పుస్తకం వంటివి ఏమీ లేవు. గ్రామీణ మండలంలో కొంతమంది గ్రానైట్ యాజమానులు ఇష్టా రీతిలో వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడబోసి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు నోరు మెదపడం లేదు. రెవెన్యూ శాఖ కానీ, మైనింగ్ అధికారులు కానీ మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిల్లా మైనింగ్ కార్యాలయంలో పనిచేసే అసిస్టెంట్ మైనింగ్ అధికారి అంతా తానై కావాల్సిన సూచనలు ఇస్తూ గ్రానైట్ యాజమాన్యం చేసే అక్రమాలను సమర్థిస్తున్నట్టు తెలుస్తుంది.
పోలేపల్లి పంచాయతీ పరిధిలో గల 149 సర్వే నెంబర్లో పోసిన వ్యర్థాన్ని ఎప్పుడు తొలగిస్తారు అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వ భూమిలో వ్యర్థాన్ని పోస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో కచ్చితంగా దీని వెనక రాజకీయ నాయకుల అండదండలు మెండుగానే ఉన్నాయని భావిస్తున్నారు. కరుణగిరి ప్రాంతం నుంచి పోలేపల్లి గ్రామంలోకి పోయే దారి లో జేసీబీ వాహనాలు, ట్రాక్టర్లు పెట్టడం వలన ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దాంతో గ్రానైట్ పనులు ఆపాలని వివిధ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. క్వారీ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల వల్ల అటువైపుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ పక్క పంచాయతీ కార్యదర్శి 149 సర్వే నెంబర్ లోని సుమారు ఆరు ఎకరాల భూమి పశువుల సంత కోసం తీర్మానం చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపించామని ప్రచారం చేస్తున్నారు. ఇదే క్వారీ యజమాని వివిధ ప్రాంతాల్లో గతంలో కూడా నిబంధనలను పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి.