- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిష్పాక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోండి: కలెక్టర్ అనుదీప్

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పాక్షపాతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అండ్ జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం నుంచి పోస్టాఫీసు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీసు సెంటర్ లో మానవహారం నిర్వహించి ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని గిరిజనులను, యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఓటరుగా నమోదు చేశామని చెప్పారు. పూసుగూడెం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం వల్ల జిల్లాలో 10,298 మంది నూతన ఓటర్లు ఓటు హక్కు పొందారని చెప్పారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, కృషి చేసిన బూతుస్థాయి, సహాయ ఎన్నికల రిటర్నింగ్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను అభినందించారు. ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని వంద శాతం ఓటింగ్ జరిగే విధంగా చేయాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగంలో మన జిల్లా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. యువతతో పాటు వృద్ధులు, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు ఓటు నమోదు కొరకు చేసిన ప్రత్యేక క్యాంపులు వల్ల రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించిందని, ఇది మనం చేసిన కృషికి, మన జిల్లా ప్రజలకు లభించిన గౌరవమని చెప్పారు.
పోలింగ్ రోజున ప్రభుత్వ సెలవు అని ఓటుహక్కు వినియోగించుకోకుండా ఉండొద్దని, పవిత్రమైన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పారు. ఓటు హక్కు పవిత్రపై ఈ రోజు మనందరం ప్రతిజ్ఞ చేశామని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నచ్చిన వారికి నిర్భయంగా ఓటు వేసే విధంగా మనందరం కట్టుబడి ఉండాలని చెప్పారు. శని, ఆదివారాల్లో ఓటరు నమోదు కొరకు నిర్వహించిన ప్రత్యేక క్యాంపుల్లో బూతుస్థాయి అధికారుల సేవలను ఆయన అభినందించారు. ఒకవైపు ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఓటరు నమోదు, మార్పులు చేర్పులు వంటి కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. జిల్లాలోని 1098 పోలింగ్ కేంద్రాల పరిధిలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఓటు హక్కును గౌరవించే పౌరుడిగా దేశ వ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో 9,14,245మంది ఓటర్లున్నారని చెప్పారు. నూతనంగా ఓటు హక్కు పొందిన వారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపి, ఎన్నికల గుర్తింపు కార్డును అందజేశారు.