- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భద్రాద్రి రామయ్య కళ్యాణానికి సర్వం సిద్ధం
దిశ, భద్రాచలం : దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రాచలం విచ్చేసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు శ్రీరామనవమి ఏర్పాట్లు పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు భద్రాచలానికి భారీగా తరలివస్తున్నారు.
సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం విద్యుత్ దీపాల కాంతులతో ధగధగా వెలిగిపోతోంది. కళ్యాణ మహోత్సవం నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సుమారు లక్ష మందికి పైగా భక్తులు హాజరై స్వామి వారి కళ్యాణాన్ని తిలకించే అవకాశాలు ఉన్నట్లుగా భావించిన అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దేవస్థానం ఈవో రమాదేవి ఇతర అధికారులు స్వామివారి కళ్యాణ ఏర్పాట్లలో తలమునకలైనారు.
ఉదయం 5 గంటలకే విధులకు సిబ్బంది : కలెక్టర్
సెక్టార్ ఇన్చార్జులుగా విధులు నిర్వహించు సిబ్బంది ఉదయం 5 గంటలకు కేటాయించిన సెక్టారులకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సెక్టార్లలో ఏర్పాట్లు పర్యవేక్షణ, వీవీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలకు విధులు కేటాయించిన సిబ్బందితో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టారులో భక్తులు పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత సెక్టారు అధికారులపై ఉందని చెప్పారు. భక్తులు వేడుకలు వీక్షించు విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పటికపుడు వ్యర్థాలను పరిశుభ్రం చేస్తూ స్వచ్ఛంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డీపీఓకు సూచించారు. ఎక్కడా వ్యర్థాలు కనబడకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఎంతో ప్రాముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి సెక్టారులో అగ్నిమాపక సిబ్బంది తమ పరికరాలతో సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రొటోకాల్ సమస్య రాకుండా ఏర్పాట్లుండాలన్నారు. అధికారులకు వాకీటాకీలు అందచేశామని, ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే కంట్రోల్ రూముకు సమాచారం అందజేయాలన, మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వేడుకలు ముగిసిన తదుపరి భక్తులు క్రమపద్దతిలో బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణకు భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైందని తెలిపారు.
వేడుకలను వీక్షించేందుకు ప్రతి సెక్టార్ లో ఎల్ ఈ డీ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు, అంబులెన్స్ లు, సీపీఆర్ సేవలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు సమాచారం అందించుటకు ప్రధాన కూడళ్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సమాచార కేంద్రంలో స్వామి వారి సేవలు, బస్సులు, రైళ్లు, అత్యవర వైద్య కేంద్రాలు, తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్ల వివరాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అత్యవసర సేవలకు భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో 08743-232444 కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని, భక్తులు ఫోన్ ద్వారా సహాయం పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి జల ప్రసాదంను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో దివీస్ ల్యాబోరేటరీస్ లిమిటెట్ ఆధ్వర్యంలో భద్రాద్రి జల ప్రసాదం పేరుతో ఏర్పాటు చేసిన ఆరు ఉచిత మంచి నీటి ప్లాంట్లను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.
దివీస్ ల్యాబోరేటరీస్ వారు సుమారు 6 కోట్ల 34 లక్షలతో తెలంగాణ లోని ప్రముఖ ఆలయాల్లో 37 మంచి నీటి ప్లాంట్ లను ఏర్పాటు చేశారని, ఒక్క యాదాద్రి లోనే 17 ప్లాంట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అను దీప్ ,ఆలయ ఈవో రమాదేవి, దివీస్ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా బందోబస్తు
భద్రాచలంలో శ్రీరామనవమికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్పీలు, డీఎస్పీలు 13 మంది, సీఐలు 55 మంది, ఎస్సైలు 156 మంది, ఏ ఎస్ ఐ లు 359 మంది, పోలీస్ కానిస్టేబుల్స్ 567, మహిళ కానిస్టేబుల్ 155, హోంగార్డులు 369 మంది, ప్రత్యేక ఫోర్స్ 21 మంది, 21X3 బెటాలియన్స్ మొత్తం 1863 మంది బందోబస్త్ నిర్వహిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.