ఎలక్షన్ వన్ సైడే ... గెలుపు మాదే

by Sridhar Babu |
ఎలక్షన్ వన్ సైడే ...  గెలుపు మాదే
X

దిశ, కూసుమంచి : ఎలక్షన్ వన్ సైడే ...గెలుపు తమదేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ కుల వృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మరోసారి ఈ వాఖ్యలు చేశారు. గురువారం నియోజకవర్గ స్థాయిలో బీసీ కుల వృత్తులకు నియోజకవర్గం వ్యాప్తంగా మంజూరైన 300 మందికి లక్ష రూపాయల చెక్కులను, అదే విధంగా కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కందాళ స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల పథకం ప్రవేశపెట్టి వారి

జీవితాలలో వెలుగులు నింపుతున్నారన్నారు. బీసీల అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. ఈ ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా అందుతుందని తెలిపారు. అప్లై చేయని వారికి మళ్లీ అవకాశం కల్పిస్తామన్నారు.

ఎవరికి ఆపద వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మూడోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా, రెండోసారి పాలేరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్ నాయక్, బోడ మంగీలాల్, బెల్లం ఉమా, రమ్య, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు వేముల వీరయ్య, మహమ్మద్ ఆసిఫ్ ఫాషా, వీరన్న, ఆత్మకమిటీ చైర్మన్ రామసహాయం బాలకృష్ణా రెడ్డి, మాజీ అధ్యక్షుడు చాట్ల పరశురామ్, వివిద శాఖల అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.



Next Story