మున్సిపాలిటీగా ఏదులాపురం..

by Sumithra |
మున్సిపాలిటీగా ఏదులాపురం..
X

దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాజపత్రాన్ని విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ ముజమ్మిలా ఖాన్ సదరు శాఖకు 12 గ్రామపంచాయతీ లతో పాటు మ్యాప్ డ్రాప్ట్ను తయారు చేసి ఫైనల్ అప్రూవల్ కోసం పంపారు. 12 పంచాయతీలతో నూతన మున్సిపాలిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూరల్ మండలంలోని పెద్దతండా, ఏదులాపురం, గుర్రం పాడు, వెంకటగిరి, గుదిమళ్ల, పోలేపల్లి, మద్దులపల్లి, బారుగూడెం, గొల్లగూడెం, ముత్తగూడెం, మద్దులపల్లి, తెల్టారుపల్లి, రెడ్డిపల్లిలో పాటు పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 12 పంచాయతీల్లో మొత్తం 56,647 జనాభా ఉంది. అది ప్రస్తుతం లక్షకు దాటింది. పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండల నాయకులతో సంప్రదింపులు జరిపి ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటైతే జిల్లాలో 12 గ్రామ పంచాయతీలు తగ్గనున్నాయి.

2018 ఎన్నికల్లో పైన పేర్కొన్న పంచాయతీలను ఖమ్మం మున్సిపాలిటీలో కొన్నింటిని విలీనం చేశారు. విలీనం పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు. అనంతరం మళ్లీ వాటిని పంచాయతీలుగా గుర్తిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. నాటి నుంచి నేటి వరకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అయితే గత ప్రభుత్వమే నూతన మున్సిపాలిటీ చేస్తే ప్రజలకు బాగుండేది. ఈ ఆలోచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 12 పంచాయతీలతో నూతన మున్సిపాలిటీకి శ్రీకారం చుట్టింది. దీంతో పాలేరుకు సైతం ఓ మున్సిపాలిటీ కళ నెరవేరింది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొ మున్సిపాలిటి ఉంది. ఖమ్మానికి అతి సమీపంలో ఉన్న పాలేరులోనే ఇంత కాలం మున్సిపాలిటీ లేదు. ఖమ్మంకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో వెంచర్లు వెలసి నూతన ఇండ్లు నిర్మితమయ్యాయి. వాటిలో మౌలికవసతుల కల్పన పంచాయతీలకు పెద్ద తలనొప్పిగా మారింది. మున్సిపాలిటీ ఏర్పడితే బడ్జెట్ పెరిగి కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండనుంది. ఈ 12 పంచాయతీలను కలిపి మున్సిపాలీటిగా ఏర్పాటు కావడంతో అభివృద్ధికి అన్నిరకాలుగా సరితూకంగా ఉంటుందని మంత్రి పొంగులేటి అభిప్రాయం.

పొంగులేటి కృషితోనే.

జూలై 2024లో పాలేరు ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూరల్ మండలంలోని నూతన మున్సిపాలీటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో భాగంగానే రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ నూతన మున్సిపాలీటికి కావాల్సిన ప్రపోజల్స్ పంపారు. మంత్రి ఆదేశాలతో చకచక మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని రకాల డ్రాఫ్టులను అధికారులు రూపొందించారు. ఫైనల్గా ప్రభుత్వం ఏదులాపురాన్ని మున్సిపాలిటీగా ప్రకటించింది. ఏది ఎమైనా పాలేరులో సైతం నూతన మున్సిపాలీటి ఏర్పాటుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నెరవేరిందని పలువురు అభిప్రాయపడుతున్నారు..

మరో మండలం ఏర్పాటు..?

రూరల్ మండలంలోని 12 పంచాయతీలు కలిపి ఓ మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తే మిగిలిన గ్రామాలన్ని కలిపి ఓ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఎం.వీపాలెం మండలం కేంద్రంగా ఏర్పాటు చేయుటకు అధికారులు బ్లూప్రింట్ సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎం.వీ పాలెం మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే 65 వేలకు పైగా ఓట్లు కలిగిన మండలంగా అవతరించనుంది. ప్రజల సమస్యలు తీర్చేందుకు ఇది దొహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ఎం.వీపాలెంలో నూతన పోలీస్ స్టేషన్ ఎస్చ్ ఓ (సీఐ) స్థాయి అధికారితో కార్యాలయం ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు అధికారులు ప్రపోజల్స్ పంపారు. స్థల సేకరణకు సైతం అధికారులు పరిశీలన చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా అతిత్వరలో ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు ఎం.వీపాలెం మండల కేంద్రం ఏర్పడనుంది.

Advertisement

Next Story

Most Viewed