- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'ప్రత్యేక నిఘా.. వారిపై కఠిన చర్యలు తీసుకోండి'

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ వద్ద గురువారం జిల్లా ఎస్పీ వినీత్ పోలీస్ అధికారులతో నెలవారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. మరలా ఏదైనా నేరానికి పాల్పడితే వారిపై పీడీయాక్ట్లను నమోదు చేయాలని సూచించారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని అవసరమైతే పీడీ యాక్టులు నమోదు చేయాలని తెలిపారు. నంబర్ ప్లేట్స్ లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని సూచించారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సమగ్ర నేర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. ఉద్యోగాల పేరుతో యువత మోసపోకుండా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, డీసీఆర్బీ సీఐ ఉపేందర్ సీఐలు, ఎస్ఐ లు, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.