- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్ ...వారం రోజుల్లో ప్లాట్ల సరిహద్దు రాళ్లను తొలిగించాలి

దిశ, వైరా : కోర్టు వివాదంలో ఉన్న భూమిలో డీటీసీపీ అనుమతి లేకుండా వేసిన వెంచర్ పై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు శనివారం ఆ వెంచర్ వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి వైరా టౌన్ ప్లానింగ్ అధికారి వి. ప్రశాంత్ నోటీసులు జారీ చేశారు. కొణిజర్ల మండలంలోని దిద్దుపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 49 లో గోరంట్ల నాగేశ్వరావు అనే వ్యక్తి పేరు పై మూడు ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంపై నాగేశ్వరావు బంధువులు కోర్టులో కేసు వేశారు.
దీంతో కోర్టు ఈ పొలం పై స్టే ఆర్డర్ విధించింది. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని వైరాకు చెందిన ఓ రియల్ వ్యాపారి 2021వ సంవత్సరంలో కొనుగోలు చేసి డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ వేశాడు. ఈ వెంచర్ లోని సుమారు 25 ప్లాట్లను మధ్యతరగతి ప్రజలకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కోర్టు వివాదంలో ఈ భూమి ఉన్న విషయం బహిర్గతం కావడంతో ప్లాట్లు కొన్న వాళ్లు తిరిగి అమ్మేందుకు వీలులేకుండా పోయింది. ఈ విషయాలను వివరిస్తూ మర్చి 28న దిశ వెబ్సైట్ లో, మార్చి 29న దిశ దిన పత్రికలో "రియల్ ఛీటర్ పై చర్యలేవి" అనే వార్త కథనం ప్రచురిమైంది. దీంతో స్పందించిన వైరా టీపీవో ప్రశాంత్ రియల్ వ్యాపారికి శనివారం నోటీసులు జారీ చేశారు.
వారం రోజుల్లో ప్లాట్ల సరిహద్దు తెలుపుతూ ఏర్పాటు చేసిన రాళ్లను తొలిగించాలని నోటీసులో ఆదేశించారు. లేని పక్షంలో మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా టీపీఓ, డీటీఎఫ్ టీం లోని సభ్యులైన వైరా ఎస్సై, తహసీల్దార్లకు డీటీసీపీ అనుమతి లేని ఈ వెంచర్ వివరాలను పంపారు. వారం రోజుల్లో రియల్ వ్యాపారి రాళ్లను తొలగించకపోతే రాళ్లను తొలగించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.