- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాజకీయ రాబంధువులను సహించను: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

'నా పేరు చెప్పి అరాచకాలు, అన్యాయాలకు పాల్పడుతున్న వారిని, నా అనుచరులుగా చలామణి అవుతూ సెటిల్ మెంట్లు, భూ వివాదాల్లో తలదూర్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు.. ఎనిమిదేళ్లుగా నేను ఎలాంటి వివాదాల్లో వేలుపెట్టలేదు.. ఏ ఒక్కరికీ అనుకూలంగా వ్యవహరించలేదు.. నా కుటుంబ సభ్యులు కూడా నా పదవిని అడ్డుపెట్టుకుని దందాలు చేయలేదు..' అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కొంతమంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి 'దిశ ప్రతినిధి' కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరైనా సద్వినియోగం చేసుకోవాలి తప్ప.. దుర్వినియోగం చేస్తే ఊరుకోబోనని స్పష్టం చేశారు. తన జీవితం అంతా ప్రజా సేవకే అంకితం అని తేల్చి చెప్పారు. బంధువులు కేవలం చుట్టరికానికే పరిమితమని.. రాజకీయ 'రాబంధు'లుగా మారితే సహించేది లేదని స్పష్టం చేశారు.
దిశ ప్రతినిధి, ఖమ్మం: కొంత మంది తన బంధువులని, తన అనుచరులని రాజకీయాలను అడ్డంపెట్టుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారని అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నాయకులు మంత్రి పేరుతో సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడుతున్నారని పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 'దిశ ప్రతినిధి' కి మంత్రి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని..తన కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమని, ఐనా ఇప్పటి వరకు ఎలాంటి దందాలు, సెటిల్మెంట్లకు పాల్పడలేదన్నారు.
తన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటివరకు పార్టీని కానీ, తన పదవిని కానీ అడ్డం పెట్టుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోలేదని చెప్పారు. తన తండ్రి, తాను ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా జరుగుతుందని.. ఈ క్రమంలో కొంతమంది తన పేరును దుర్వినియోగం చేస్తూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్నారు. కాలమే వారికి తగిన సమాధానం చెబుతుందని వెల్లడించారు.
బంధువులంటూ రాజకీయం చేస్తే..
కొందరు తన బంధువులంటూ.. రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. రాజకీయ పబ్బం గడుపుతున్నారని అలాంటి వారిని తానెప్పుడూ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. బంధుత్వం కేవలం చుట్టరికం మాత్రమే అని.. అంతేకానీ.. తన రాజకీయ జీవితంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును దుర్వినియోగం చేస్తే అవసరమైతే బంధుత్వాన్ని వదులుకుంటాను కానీ.. అలాంటి వారిని మాత్రం ఎప్పటికీ దగ్గరికి తీయనన్నారు. అలా ఎవరైనా చేస్తే రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొంతమంది వ్యక్తులు పువ్వాడ తమ బంధువంటూ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అలాంటివారిని ఉపేక్షించేది లేదన్నారు. తన తండ్రి, భార్య, కొడుకు, వదిన ఇలా ఎవరూ పార్టీ విషయంలో వేలు పెట్ట లేదని, పార్టీ పేరు చెప్పుకుని, తన పదవిని అడ్డు పెట్టుకుని ఎలాంటి ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పారు.
అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే..
పార్టీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చామని.. వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి చేయూత నివ్వాలని సూచించారు. అయితే దానిని అదునుగా తీసుకుని కొందరు కార్పొరేటర్లు, పార్టీ నేతలు విపరీతంగా వివాదాలు, సెటిల్ మెంట్లు, భూ దందాల్లో తలదూర్చుతున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని పార్టీ ఎన్నటికీ క్షమించదని.. తాను కూడా ఇలాంటి వారిని సహించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజాసేవకు పాల్పడాల్సింది పోయి.. కొందరు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారన్నారు. అంతేకాదు..పార్టీకి అనవసర తలనొప్పులు తెచ్చిపెడుతున్నారని వీటిని ఎవరూ ఉపేక్షించొద్దన్నారు. ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాలకు పాల్పడే వారు వెంటనే తమ పద్ధతి మార్చుకుని వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు.
భూ వివాదాల్లో తలదూర్చితే..
నగరంలో రియల్ వ్యాపారం గతం కంటే జోరందకుందని.. నగరం నలుమూలలా అభివృద్ధి దూసుకు పోతుందన్నారు. అయితే దీని వల్ల భూ వివాదాలు కూడా ఎక్కువయ్యాయని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతమంది దొంగ పత్రాలు సృష్టించి ఆ భూముల పై కన్నేయడం.. లేకుంటే వాళ్లే సెటిల్మెంట్ల పేరుతో డబ్బులు దండుకోవడం లాంటివి కూడా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్నారు. లిటిగేషన్ లో ఉన్న భూముల పేరుతో సెటిల్మెంట్లను ప్రోత్సహించేవారిని, వారికి సహకరించే రాజకీయ నాయకులను కూడా తాను సహించ బోనన్నారు. జిల్లాలో విపరీతంగా వెంచర్లు వెలుస్తున్నాయని ఎవరి వద్దనైనా తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. రియల్ వ్యాపారుల వద్ద అనుమతుల కోసం ఎవరైనా డబ్బులు తీసుకున్న.. వారిని ఇబ్బందులకు గురిచేసినా వారిని గుణపాఠం తప్పదన్నారు.
సామాన్య జనానికి అందుబాటులో..
తాను ఎప్పటికీ సామాన్య జనానికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని, తన దగ్గరకు ఎవరైనా వస్తే చట్టపరంగా జరగాల్సిన న్యాయం జరిగేలా చేయడమే తన లక్ష్యం అన్నారు. ఎవరు ఎప్పుడైనా తమ సమస్యలు చెప్పుకునేందుకు తన దగ్గరకు రావొచ్చని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం అంతా ప్రజా సేవకే అంకితం అన్నారు. అంతేకానీ మేమున్నామంటూ చోటామోటా నాయకులు సెటిల్మెంట్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అభివృద్ధి బాటలో జిల్లా..
ఒకప్పటి ఖమ్మానికి.. ఇప్పటి ఖమ్మానికి రూపురేఖలు చాలా మారిపోయాయన్నారు. అభివృద్ధిలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలకు అందనంతగా నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటపట్టిస్తున్నామని, పార్టీని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా పటిష్ట పరిచి వచ్చే ఎన్నికల్లో ఎవరు ఇవ్వని విధంగా సీట్లు అందిస్తామన్నారు. ఈ క్రమంలో పార్టీ పేరును, తన పేరును ఉపయోగించుకుంటూ అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. వారు ఎంతటి దగ్గరి వారైనా, పార్టీ వారైనా వదిలేది లేదన్నారు. పార్టీని నష్టపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా వారికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
ప్రైవేట్ పంచాయితీలు ఆపాల్సిందే..
చట్టం ముందుకు రాకుండా అనేక ప్రైవేట్ పంచాయితీలు జరుగుతున్నాయని, వాటిని ఎవరు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ పంచాయితీలు చేసేవారు ఇక నుంచి తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. బాధితులు ఎవరైనా న్యాయం చేసేందుకు చట్టం ఉందని, ఎవరో ఒకరివైపు వకాల్తా పుచ్చుకుని న్యాయం చేస్తామని బీరాలు పలకడం పెద్దమనుషులు గా చలామణి అవుతున్న వారికి తగదన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా నిర్భయంగా తన వద్దకు రావచ్చని, వారి అన్ని విధాలా న్యాయం చేసేందుకు చట్టపరంగా సహకరిస్తానని తెలిపారు.
ఓర్వలేకే ప్రతిపక్షాల కుయుక్తులు..
తాను చేస్తున్న అభివృద్ధిని చూసి కొంతమంది ప్రతిపక్ష నాయకుల కుయుక్తులు పన్నుతున్నారని, తన రాజకీయ జీవితాన్ని అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారని.. కానీ అలాంటి వారెందరు వచ్చినా ప్రజల మనసుల్లో తన పేరును చెరపలేరన్నారు. ఖమ్మం అభివృద్ధిలో తన మార్క్ ఎప్పటికీ నిలిచిపోతుందని.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పార్టీని కూడా ఉమ్మడి జిల్లాలో ఇంకా పటిష్ట పరిచి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తామన్నారు. పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరైనా తన పేరు చెప్పి కానీ, పార్టీ పేరు చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అలాంటి నీతి మాలిన పనులు చేసి ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇస్తే చూస్తూ ఊరుకోనన్నారు.