పట్టణాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం

by Sridhar Babu |   ( Updated:2023-06-16 13:50:07.0  )
పట్టణాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం
X

దిశ, వైరా : పట్టణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైరాలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా పట్టణంలో మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి పథకం ద్వారా నిధులు కేటాయించి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేశారన్నారు.

పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే కేసీఆర్ గొప్ప పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు, పలు సంక్షేమ పథకాలు అందించారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు నాయకులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, కమిషనర్ పి. వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు మున్సిపల్ పాలకవర్గ కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు.



Next Story

Most Viewed