వెంటిలేటర్ పై ప్రజాస్వామ్యం

by Sridhar Babu |
వెంటిలేటర్ పై ప్రజాస్వామ్యం
X

దిశ, భద్రాచలం : వెంటిలేటర్ పై ప్రజాస్వామ్యం ఉందని, దానిని కాపాడాలని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం స్థానికంగా ప్రజాతంత్ర వాదుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఎటు పోతుంది, భద్రాచలంపై ఈ చిన్న చూపు వైఖరి ఏంటి అని అన్నారు. భద్రాచలం ఎంతో ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం అని, ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ముంపు తీవ్రంగా ఉందని, ఇక్కడి పరిసర ప్రాంతాలలో గోదావరి వచ్చినప్పుడు చాలా ఇళ్లు నీట మునిగామని గుర్తు చేశారు. అప్పుడు అధికారులు వచ్చి చూసి వెళ్లిన వారే కానీ ఇప్పటివరకు వారి సమస్యకు పరిష్కారం చూపెట్టలేదన్నారు. ఆదివాసీలు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కి వెళితే నిలువు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలన్నీ తీర్చాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని పేర్కొన్నారు.

పత్రికల వారు కూడా అందరూ ఐక్యంగా ఉండి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.నిరూప్ మాట్లాడుతూ భద్రాచలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో అనేకమంది ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో వారిలో చైతన్యం తేవాలని సూచించారు. కోర్టు పని మీద తిరిగి వస్తున్న లాయర్ ని ఆయన భార్యని రోడ్డు మీద నరికినా కూడా వారిని అదుపులోకి తీసుకోలేని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీజేఎస్ఎస్ అధ్యక్షులు అన్నం చిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీరామ నవమికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకురావడం అనేది ఎప్పటినుంచో ఆనవాయితీ, కానీ కేసీఆర్​ గెలిచిన దగ్గర నుంచి ఇంతవరకు పట్టు వస్త్రాలు తీసుకురాలేదన్నారు. భద్రాచలంపై ఎందుకు ఇంత చిన్న చూపు అన్నారు.

వరదలు వచ్చినప్పుడు రూ.వెయ్యి కోట్లు ప్రకటించి ఇప్పటివరకు పది కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేదన్నారు. కరోనా టైం లో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలా తక్కువ మంది వ్యాధి బారిన పడ్డారని, అందుకు కారణం ఇక్కడి అటవీ ప్రాంతంలో ఎన్నో వనమూలికలు దొరకడమే అన్నారు. అలాంటి ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఆదివాసీలు ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇకనైనా భద్రాచలానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు.

తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షులు కరుణాకర్ దేశాయ్ మాట్లాడుతూ తెలంగాణను ఎందుకు సాధించామో అర్థం కావడం లేన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి తెలియజేయాలని కోరారు. మట్టి మనిషి పాండురంగారావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేపర్ లీకేజీలు, మాఫియా స్వేచ్ఛగా చేయగలుగుతున్నారని తెలిపారు. ఆనాటి కాలంలో చిన్న ఆరోపణలు వస్తేనే రాజీనామా చేసేవారని, కానీ ప్రస్తుత రాజకీయ పార్టీలు అవినీతికి అడ్డాగా ఉన్నాయి అన్నారు.



Next Story

Most Viewed