దయానంద్‌ దారెటు ?...పొంగులేటి వెంట నడవరా ?

by Sridhar Babu |
దయానంద్‌ దారెటు ?...పొంగులేటి వెంట నడవరా ?
X

దిశ, కల్లూరు : తొమ్మిదేళ్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రయాణిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయకుమార్‌ రాజకీయ ప్రయాణం ఎటువైపు అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పటి వరకూ ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న డాక్టర్‌ దయానంద్‌ మాత్రం పొంగులేటి వెంట నడిచేందుకు సుముఖంగా లేరని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సంచలనాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజ కవర్గం వైపు పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి సత్తుపల్లి వైపు మళ్లింది. ఈక్రమంలో పొంగులేటి అనుచరుడు డాక్టర్‌ దయానంద్‌ ఆయనతో కలిసి వెళ్లే విషయంలో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

2014లో వైసీపీ నుంచి పోటీ

దయానంద్‌ విజయకుమార్‌ 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్‌కు పోటీ చేశారు. పొంగులేటి పార్లమెంట్‌ అభ్యర్థిగా గెలుపొందగా దయానంద్‌ మాత్రం స్పల్ప లేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి దయానంద్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉంటున్నారు. 2018 ఎన్నికల్లో సత్తుపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించినా పార్టీ ఆయనకు టిక్కెట్‌ ఇవ్వలేదు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీడీపీలో గెలుపొంది బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సత్తుపల్లిలో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ నుంచి దయానంద్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో రానున్న ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు దయానంద్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న పార్టీ నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీలోకి వెళితే తనకు ప్రజల నుంచి ఆశించిన మేర ప్రయోజనం ఉండదని దయానంద్‌ భావిస్తున్నట్లు సమాచారం. పొంగులేటి బీఆర్‌ఎస్‌లో కొనసాగినా తనకు రాజకీయ భవిష్యత్తు లేదని దయానంద్‌ భావిస్తున్నారని తెలుస్తోంది.

దయానంద్‌ కోసం ప్రయత్నాలు

శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి మారితే ఆయనతో పాటు దయానంద్‌ను కూడా వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెపుతున్నారు. కానీ దయానంద్‌ బీజేపీలో చేరే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు దయానంద్‌ అత్యంత సన్నిహితులు చెపుతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సాంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన పార్టీ నుంచి దయానంద్‌కు ఆహ్వానం ఉందని, ఆ పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని దయానంద్‌కు అనుచరులు సూచిస్తున్నట్లు సమాచారం. మరో పక్క దయానంద్‌ను ఎలాగైనా పొంగులేటితో నడిపించేందుకు కొందరు ప్రయత్నాలు చేపట్టారని తెలిసింది. ఈ పరిస్థితుల్లో రెండు రోజులుగా దయానంద్‌ ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లారనే ప్రచారం కూడా సాగుతోంది. తొమ్మిదేళ్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నడిచిన దయానంద్‌ భవిష్యత్తు ప్రయాణం ఎటువైపు అనేది ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.



Next Story

Most Viewed